‘ద్రోహ్ కాల్’… సినిమా గుర్తుందిగా? గోవింద్ నిహలానీ తీసిన ఈ చిత్రం 1994లో పెద్ద సంచలనం. ఓంపురి, నసీరుద్దీన్ షా తదితరులు నటించిన ‘ద్రోహ్ కాల్’ సినిమాను కమల్ హాసన్, అర్జున్ తారాగణంగా ‘ద్రోహి’ పేరుతో దక్షిణాది భాషల్లో రీమేక్ కూడా చేశారు. తీవ్రవాద ఉద్యమ అణచివేతలో పోలీసుల కష్టాన్ని, త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ఇది. సినిమా సినిమాయే… కల్పిత కథతో, లేదంటే వాస్తవ ఘటన ఆధారంగా పాత్రలను ఎలాగైనా మల్చుకోవచ్చు. అది వేరే విషయం.
కానీ నిజజీవితపు ఉదంతాలు ఇందుకు విరుద్ధం. ఇష్టానుసారం మల్చడం కుదరదు. జరిగిన ఘటనలు చరిత్రగా మిగిలిపోతాయి. ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను అణచివేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. అనేక ఘటనలు ‘ద్రోహ్ కాల్’ సినిమాను గుర్తు చేశాయి కూడా. కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, సోమ్లానాయక్ వంటి నక్సల్స్ ఉద్యమంలోనే ఉంటూ ఆ పార్టీ అగ్రనేతలను కాల్చి చంపిన ఘటనలు చరిత్ర. ఫలితంగా పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ వంటి అగ్రనేతలనే కాదు, దళాలకు దళాలను సైతం అప్పటి పీపుల్స్ వార్ సంస్థ నష్టపోయింది. ఈ ఉదంతాలను పోలీసు అధికారులు ‘కోవర్ట్’ అపరేషన్లుగా ప్రకటించారు. రాజ్యం నిర్దేశించిన విధుల్లో పోలీసులకు ఇదో భాగమే కావచ్చు. ఇరువర్గాల యుద్ధంలో లాభ, నష్టాల తర్కం అప్రస్తుతం.
ఇటువంటి అనేక అపరేషన్లు తెలుగు రాష్ట్రాల పోలీసులకు, ముఖ్యంగా తెలంగాణా పోలీసులకు కొత్తేమీ కాదు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ ను ఉపయోగించుకుని సైతం పీపుల్స్ వార్ పార్టీని పోలీసులు భారీగా నష్టపరిచినట్లు వార్తలు వచ్చాయి. ఇదే దశలో తీవ్రవాద పార్టీలకు సహకరించిన పోలీసులు కూడా ఉన్నారు. అనేక ఎదురుదెబ్బలు తింటున్న పరిస్థితుల్లోనే ఇటీవల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇదే తరహా సంఘటన వెలుగు చూసింది. మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు తుపాకీ తూటాలను సరఫరా చేసిన ఘటనలో ఇద్దరు పోలీసులు దొరికిపోయారు. వారిని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఉద్యోగాల నుంచి తొలగించారు.
తీవ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన పోరాటంలో పరస్పర ఎత్తుగడలు, వ్యూహాలు సర్వసాధారణం. వివిధ కారణాలవల్ల ఇరువర్గాలు కూడా ‘కోవర్టు’లను ప్రవేశపెట్టిన చరిత్ర ఉంది. 1990వ దశకంలో తమపై దూకుడుగా వ్యవహరిస్తున్న ఓ పోలీసు అధికారిని మట్టుపెట్టేందుకు నక్సలైట్లు ఓ ‘పాల వ్యాపారి’ని ఉపయోగించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ఆయా అధికారి అప్రమత్తత వల్ల నక్సల్స్ ఎత్తుగడ భగ్నమైందని పోలీసులు చెబుతుంటారు. ఇది తీవ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధంలో ‘కోవర్టు’ ఎత్తుగడల వ్యవహారం.
కానీ ఉత్తరప్రదేశ్ ఘటనలో జరిగిందేమిటి? వికాస్ దూబే అనే రౌడీషీటర్ ముఠా డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఉదంతంలో రౌడీ ముఠాకు ఓ స్టేషన్ పోలీసు అధికారే సహకరించారట. చౌబేయ్ పూర్ స్టేషన్ అధికారి వినయ్ తివారీని అనుమానిస్తూ ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా వికాస్ దూబేని అరెస్ట్ చేసేందుకు అదనపు భద్రతా బలగాలతో వెళ్లిన సమాచారం ముందే లీకైందట. ఇదే అనుమానంతో వినయ్ తివారీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విచారణలో వాస్తవాలు తేలితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
నక్సల్ పార్టీల్లో పోలీసులు చేసేది ‘కోవర్ట్’ ఆపరేషన్. కొందరు పోలీసులూ తీవ్రవాదులకు సహకరించిన ఘటనలు ఉండవచ్చు. ఇందుకు కారణాలు అనేకం ఉండి ఉండవచ్చు. కానీ రౌడీ ముఠాలకు సహకరించినట్లు ఆరోపణలు గల వినయ్ తివారీ వంటి అధికారులకు ఇప్పుడో కొత్త పేరు కావాలి. అదేమిటన్నదే అసలు ప్రశ్న.