నిర్భయ నిందితులకు ఉరి శిక్ష, షాద్ నగర్ ఎన్కౌంటర్ వంటి ఘటనలు సైతం కొందరు కీచకలను భయపెడుతున్నట్లు లేవు. ఉత్తర ప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనను చూడండి. బెయిల్ పై బయటకు వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఓ మానవ మృగం బాధితురాలిని ఎలా భయాందోళనకు గురి చేస్తున్నాడో? విచారణ కోర్టుకు వచ్చావంటే ఉన్నావ్ కంటే అతి భయంకరంగా చంపుతానంటూ ఏకంగా ఓ లేఖ బాధితురాలి ఇంటి ఎదురుగా అటించాడు ఆ రాక్షసుడు.

బాదితురాలిని బెదిరిస్తూ నిందితుడు అంటించిన లేఖ ఇదే

అసలు విషయంలోకి వెడితే… ఉత్తర ప్రదేశ్ లోని భగపట్ ఏరియాకు చెందిన ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఇందుకు సంబంధించి బాధితురాలు గత జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతన్ని బెయిల్ పై విడుదల చేశారు. కేసుకు సంబంధించి శుక్రవారం అంటే ఈనెల 13వ తేదీన విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నిందితుడు బాధితురాలిని భయకంపితురాలిని చేస్తూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగాడు. ఇందులో భాగంగానే ‘నువ్వు కోర్టుకు వచ్చావంటే ఉన్నావ్ కన్నా భయంకరంగా చంపుతా’ నంటూ బాధితురాలి ఇంటి ముందు లేఖ రాసి అంటించాడు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని బాధితురాలికి సెక్యూరిటీ ఇచ్చారు. కోర్టుకు హాజరు కావడం కోసం ఉన్నావ్ బాధితురాలు వెడుతుండగా, మార్గమధ్యంలో దారి కాచిన నిందితులు ఆమెను సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం కలిగించిన ఈ ఘటనను మరువకముందే మరో అత్యాచార బాధితురాలిని అంతకన్నా భయంకంరంగా చంపేస్తానంటూ ఆమె ఇంటిపై నిందితుడు లెటర్ అంటించడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version