ఈనాడు దినపత్రికను చూసి చాలా మంది కుళ్లుకుంటారు గాని… కొన్ని విషయాల్లో ఇప్పటికీ ఆ సంస్థ తీరును, దాని యాజమాన్యం అవలంభించే కొన్ని ‘విలువ’లను ఎవరైనా సరే అంగీకరించక తప్పదు. ఈనాడు ఎదిగిన తీరు, దాని యజమాని రామోజీరావు వ్యాపారాల గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అదంతా వేరే విషయం. కానీ పత్రిక నిర్వహణలో, ముఖ్యంగా పాత్రికేయుల ప్రవర్తన, వారి వ్యవహారశైలిపై యాజమాన్య నిఘా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది.
ఎవరో ఆరోపణ చేశారని ఆ సంస్థ గాలికి తీసిపారేయదు. అందులోగల నిజానిజాలేమిటనే అంశంపై ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. చాలా సంఘటనల్లో అది రుజువైంది కూడా. కాకపోతే ఇటువంటి వ్యవహారాల్లో దశాబ్ధాల క్రితం ఉన్న చిత్తశుద్ధి ఇప్పుడు లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే…? దిగువన గల ఓ వార్తా కథనాన్ని ముందు పరిశీలించండి.
చూశారుగా వార్తా కథనం. బాగుంది కదా స్టోరీ! గత నెల 19వ తేదీన క్రికెట్ బెట్టింగ్ పై ఈనాడు ప్రచురించిన వార్తా కథనమిది. క్రికెట్ బెట్టింగ్ ఏయే ప్రాంతాల్లో సాగుతోంది? ఏ వయస్సువారు ఎక్కువగా బెట్టింగులో పాల్గొంటున్నారు? పోలీసు అధికారులు ఏమంటున్నారు.? వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ సమగ్ర వార్తా కథనాన్ని ప్రచురించారు. అన్ని వివరాలతో రిపోర్టర్ అందించిన ముడిసరుకు కథనానికి ఈనాడు డెస్క్ మెరుగులు దిద్దుతుంది. అది ఈనాడు తరహా ప్రత్యేకత కూడా.
క్రికెట్ బెట్టింగ్ కొనసాగుతున్న తీరుపై అత్యధిక సర్క్యులేషన్ గల ఈనాడు వంటి పత్రికలో వార్త ప్రచురితమయ్యాక పోలీస్ యంత్రాంగం ఊరకనే ఉండదు కదా? చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. కాకపోతే ఈ బెట్టింగ్ వ్యవహారంలో వార్త రాసిన విలేకరి బాగోతమే బట్టబయలైంది. ‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడిన’ చందంగా, వార్త రాసిన విలేకరి బెట్టింగ్ దందాలో పాల్గొన్నట్లు పోలీసులకు ఆధారాలు చిక్కాయి. తాను బెట్టింగ్ ద్వారా నష్టపోయినట్లు సదరు విలేకరి మరొకరితో నెరపిన సంభాషణల ఆడియో లీకైంది.
ఇంకేముంది…? పోలీసులకన్నా ముందుగానే ఈనాడు యాజమాన్యం అప్రమత్తమైంది. ఈ ఘటన మరింత ముదిరి సదరు విలేకరిపై కేసు నమోదైతే పత్రిక పరువు పోతుందని భావించి అత్యంత వేగంగా తనదైన తరహా విచారణను కొనసాగించింది. ఆడియో సంభాషణలను నిశితంగా పరిశీలించి బెట్టింగ్ కు పాల్పడిన ఆయా విలేకరిని ఇంటికి పంపిందట. వార్త ప్రచురితమైన సుమారు 12 రోజుల వ్యవధిలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయింది. అబ్బే వార్తా కథనాన్ని సమగ్రంగా రాసేందుకే, దాని లోతుల్లోకి వెళ్లడానికే ఆ విలేకరి బెట్టింగ్ కు పాల్పడి ఉండొచ్చు కదా? అని సందేహించకండి. అలా భావించడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇటువంటి కాకమ్మ కబుర్లు నమ్మడానికి అదేదో మీడియా సంస్థ కాదు. దాని పేరు ఈనాడు. అదీ సంగతి.