బిజినెస్ అన్నాక కాస్త ‘అప్ డేట్’ కావాలి మరి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార లావాదేవీల్లోనూ మార్పులకు నాంది పలకాల్సిందే. లేకుంటే వెనుకంజ తప్పదు. అది ‘బిజినెస్ మాగ్నెట్లు’గా పిల్చుకునే కార్పొరేట్ వ్యాపారవేత్తలు కావచ్చు, ఫుట్ పాత్ లపై జీవనం సాగించే చిన్న తరహా వ్యాపారులు కావచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మారక తప్పదు.
ముంబయిలోని ఈ ఆటోను చూడండి. దేశ వాణిజ్య నగరంలో ‘ఫస్ట్ హోం సిస్టమ్ ఆటో’గా ప్రాచుర్యం పొందింది. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, మొబైల్ కనెక్టివిటీ టీవీ, మ్యూజిక్, వీడియో బ్లూ టూత్, వాష్ బేసిన్, డ్రింకింగ్ వాటర్, కూలర్, ఫ్యాన్ వంటి సకల సౌకర్యాలు గల ఈ ఆటో గత నవంబర్ లోనే వార్తల్లోకి ఎక్కింది. తద్వారా ‘ముంబయి ఫస్ట్ హోం సిస్టమ్ ఆటో రిక్షా’గా పేరు గాంచింది. సీనియర్ సిటిజన్లకు కిలోమీటర్ వరకు ఫ్రీ సర్వీసును కూడా ఆటో యజమాని అందిస్తారు.
ఇప్పుడీ ఆటో గురించి కొత్తగా చెప్పే అంశమేమిటంటే…? కరోనా ధాటికి ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే కదా? ముంబయి నగరంలో కరోనా మహమ్మారి జడలు విప్పి మరీ కరాళనృత్యం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆటో యజమాని సత్యవాన్ గీతే సరికొత్త యోచన చేశాడు. ఆటోలోని సకల సౌకర్యాలను మరింత అప్ డేట్ చేశాడు. కరోనా వైరస్ నుంచి కాపాడుకునే శానిటైజర్ వంటి వస్తువులనూ ఆటోలో అమర్చాడు. తన ఆటో ఎక్కడం వల్ల ప్రయాణీకులకు ఇబ్బందేమీ లేదని చెప్పకనే చెబుతున్నాడు.
కరోనా ధాటికి ఉపాధికి గండి పడిన పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ సత్యవాన్ తన పాట్లు తాను పడుతూనే ఉన్నాడు. అదీ అసలు విషయం. కరోనా కారణంగా అప్ డేట్ చేసిన ఆటో వీడియోను దిగువన చూడండి.