‘మాజీ’ అయినా సరే… పరిస్థితులను, పరిణామాలను తనకు అనుకూలంగా, సానుకూలంగా మల్చుకోవడంలో తుమ్మల నాగేశ్వర్ రావు శైలే వేరని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. గత ఎన్నికల సందర్భంగా పాలేరులో తన ఓటమికి పావులు కదిపిన నాయకుల గురించి ఆయన ఆలస్యంగా తెలుసుకుని ఉండొచ్చు. కానీ తన తపనను, కష్టాన్ని, కృషిని ఛాన్స్ దక్కిందే తడవుగా ప్రజల ముందుంచడంలో తుమ్మల నాగేశ్వర్ రావు రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తుంటారనే పేరు ఉండనే ఉంది. ఖమ్మం నగరంలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం, పాత బస్ స్టేషన్ మనుగడపై భారీ ఎత్తున పోరాటాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పక్షాలు అఖిలపక్షంగా ఏర్పడి మరీ ‘పాత బస్ స్టాండ్ పరిరక్షణ కమిటీ’గా ఏర్పడ్డాయి. ఈ విషయంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కూడా స్పందించారు. ‘పాతబడిన పార్టీలు, పాతరేయబడిన పార్టీలు, పాత బస్ స్టాండ్ కోసం చేస్తున్న పాత పంథాను విరమించుకోవాలని ఆయన అభ్యర్థించారు. అయినప్పటికీ అఖిలపక్షం నేతలు శాంతించడం లేదు. ‘మీ నాన్నగారు పాత పార్టీ కాదా? పాత పార్టీలో ఉండి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేదా మీరు?’ అని కౌంటర్ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పాత బస్ స్టాండ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. పాత బస్ స్టేషన్ ను మూసేయకుండా, సిటీ బస్సుల అవసరాల కోసం కొనసాగించాలని తుమ్మలకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్ రావు ఎలా స్పందించాలరో తెలుసా?
ఖమ్మంలో నిర్మాణం పూర్తి కావచ్చిన హైటెక్ బస్ స్టేషన్ నిర్మాణం కోసం తాను పడిన కష్టాన్ని వారికి సోదాహరణంగా వివరించారు. సీఎం కేసీఆర్ 2015లో జిల్లాకు తొలిసారి వచ్చిన సందర్భంగా ఎన్నెస్పీ స్థలాన్ని చూపించి హైటెక్ బస్ స్టేషన్ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించానన్నారు. ఇందుకోసం 7.9 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. అప్పట్లో పాత బస్ స్టేషన్ ను సిటీ బస్సుల అవసరాలకోసం, కొత్తగా నిర్మించే హైటెక్ బస్ స్టేషన్ ను ఎక్స్ ప్రెస్ సర్వీసుల కోసం వినియోగించాలని తాము నిర్ణయించామన్నారు. ఈ విషయంలో అప్పట్లో తాను నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం మంత్రిగా తాను లేనని, అందువల్ల ఈ విషయంలో రవాణా మంత్రి అజయ్ కుమార్ తోనే తేల్చుకోవాలని పాత బస్ స్టాండ్ పరిరక్షణ కమిటీ నేతలకు స్పష్టం చేశారు.
అంతే కాదు… ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో గోళ్లపాడు ఛానల్ సమస్య పరిష్కారానికి సీఎం ఆయా ప్రాంతంలో పర్యటించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గోళ్లపాడు బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పించానని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మంత్రి కేటీఆర్ ను ఒప్పించి ఐటీ హబ్ నిర్మాణానికి పునాది వేశానన్నారు. పాత బస్ స్టాండ్ ను కాపాడాలని, దాన్ని కొనసాగించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులతో తుమ్మల ఖమ్మం నగర అభివృద్ధికి ఇలా తన కృషిని ఏకరవు పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. ఇంతకీ తుమ్మల ఈ సందర్భంగా ఓ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అదేమిటో తెలుసా?
హైటెక్ బస్ స్టేషన్, గోళ్లపాడు ఛానల్, ఐటీ హబ్ వంటి ప్రధాన అభివృద్ధి పనులను మంత్రి అజయ్ పదే పదే తన ‘సత్తా’గా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే కదా? ఆయా నిర్మాణాలన్ని తన కృషి మాత్రమేనని, అజయ్ కుమార్ ఇందులో చేసిందేమీ లేదని తుమ్మల చెప్పకనే చెప్పినట్లుగా రాజకీయ పరిశీలకులు ఛలోక్తులు విసురుతున్నారు. పాత బస్ స్టేషన్ కొనసాగింపు అంశాన్ని కూడా రవాణా మంత్రిగా ఉన్న అజయ్ తోనే తేల్చుకోవాలని సలహా ఇచ్చారు. అదీ సంగతి… విషయం పూర్తిగా మీకు అర్థమైనట్లే కదా!