ఒక్కరు కాదు… ఇద్దరు కాదు. నూరు, ఇన్నూరు, మున్నూరు కూడా కాదు. అక్షరాలా 45 వేల మంది పార్టీ సైన్యం. కేవలం రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి తెలంగాణా అధికార పార్టీ భారీ కసరత్తే చేస్తున్నదట. వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్న భారీ కసరత్తు ఆత్యంత ఆసక్తికర పరిణామాలుగా చెప్పుకోవచ్చు.
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం… ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గులాబీ పార్టీ సవాల్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ప్రతి 50 మంది ఓటర్లకు ఓ బాధ్యుడిని, ప్రతి పోలింగ్ బూత్ కు 20 మంది కార్యకర్తల చొప్పున నియమిస్తారట. ఇందుకోసం సన్నాహాలు కూడా చేస్తున్నారట. నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా ఎమ్మెల్యేలను నియమిస్తారట. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో గల 4.91 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలోని 5.10 లక్షల మంది ఓటర్లను మొత్తం 45 వేల మంది టీఆర్ఎస్ సైన్యం ఆకట్టుకోవాలి. కేసీఆర్ సర్కార్ చేస్తున్నఅభివృద్ధి పనులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ 45 వేల మంది గులాబీ సైన్యం ఓటర్లకు వివరించాలి. ఒక్క ఓటు కూడా ప్రత్యర్థులకు లభించకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఇదీ లక్ష్యం.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపును టీఆర్ఎస్ పార్టీ ఎందుకింత సవాల్ గా స్వీకరిస్తున్నది? ఇదీ అసలు ప్రశ్న. వాస్తవానికి ఆయా స్థానాలు దక్కకున్నా ప్రభుత్వ మనుగడకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు. అయినప్పటికీ కేవలం రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకనేందుకు 45 వేల మంది పార్టీ సైన్యాన్ని మోహరింపజేయడమంటే రాజకీయంగా సాధారణ విషయమేమీ కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, ఇతరత్రా పదవుల్లో గల చిన్నా, పెద్దా నాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు ఈ రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేందుకు పాటుపడాల్సిందే. ఎంతలా కష్టపడాలీ అంటే… పాలేరు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల నాటి సీన్లను మళ్లీ తలపించాలి. ఓటు ఓటునూ ఒడిసి పట్టాల్సిందే. అంతిమంగా గెలవాల్సిందే. ఇదీ టీఆర్ఎస్ పార్టీ అసలు టార్గెట్.
దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లభించిన ఫలితాలు అధికార పార్టీని తాజాగా అప్రమత్తం చేశాయనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమవుతోంది. ఓవైపు బీజేపీ బండి సంజయ్ తొడ గొడుతున్నాడు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనేకాదు వచ్చే 2023 సాధారణ ఎన్నికల్లోనూ గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ప్రతిన పూనుతున్నాడు. ఇటువంటి పరిణామాల్లో ఇప్పుడు జరగబోయే ప్రతి ఎన్నిక కూడా అధికార పార్టీకి ‘ఇజ్జత్’కా సవాల్ గానే పరిణమించాలి. నాగార్జునసాగర్ చేజారినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవి చూసినా తెలంగాణాలో రాజకీయ పరిణామాలు తారుమారు అవుతాయనే ప్రచారం ఎలాగూ ఉంది. అందుకే అధికార పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు కనిపిస్తోంది.
వ్యూహరచన, ప్రణాళిక బాగుంది. కసరత్తు జరగాల్సిందే. నలభై అయిదు వేల మంది మాత్రమేనా? అవసరమైతే మరో యాభై వేల మంది పార్టీ సైన్యాన్ని మోహరింపజేయగల సత్తా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. అర్థబలం విషయంలోనూ ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. కానీ.., జరగబోతున్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే ప్రతి ఓటరూ విద్యావంతుడే. ఇందులో నిరుద్యోగులు, ఉద్యోగులు, అధికారులు, అనధికారుల వంటి వారున్నారు. అంతా చదువుకున్నోళ్లే… కాస్తో, కూస్తో రాజకీయ చైతన్యాన్ని కలిగినవారే. టీఆర్ఎస్ మందీ మార్బలానికి, ఆర్భాటపు ప్రచారానికి గ్రాడ్యుయేట్లు గంపగుత్తగా మొగ్గు చూపేనా? ఇదీ అసలు సందేహం. ‘అయినా తగ్గొద్దు… ఇది ఇజ్జత్ కా సవాల్’ అంటున్నాయి గులాబీ శ్రేణులు.