మీడియాలో ‘సబ్’ ఎడిటర్… ముఖ్యంగా ప్రింట్ మీడియాలో సబ్ ఎడిటర్ పోస్టు. సబ్ ఎడిటర్ అంటే చాలా మంది ఎడిటర్ తర్వాత పోస్టు కాబోలు అనుకుంటారు. ఎందుకంటే హోదాలో ‘సబ్’ అనే పదం వల్ల మీడియా వ్యవస్థపై అవగాహన లేనివారు ఎడిటర్ తర్వాత ఉద్యోగంగా భావిస్తుంటారు. కానీ అదేమీ కాదు. సబ్ ఎడిటర్ అంటే స్టాఫ్ రిపోర్టర్ స్థాయి హోదా అన్నమాట. ఈ సబ్ ఎడిటర్ కూడా సంస్థ ఉద్యోగే. పార్ట్ టైమ్ ఎంప్లాయి కాదు. వేతనం సగటున ఓ రూ. 25 వేలు ఉంటుంది. సీనియారిటీని బట్టి, సంస్థను బట్టి కాస్త అటూ, ఇటూగా వేతనం ఉండొచ్చు.
మండల స్థాయి విలేకరులు, స్టాఫ్ రిపోర్టర్లు పంపే వార్తలను సరిదిద్ది పేజీల్లో నింపడమే సబ్ ఎడిటర్ విధి. సరే సబ్ ఎడిటర్ పోస్టుల్లో ఉన్నవారందరూ అక్షర దోషాలను దిద్దే మేధావులేనా? అనే ప్రశ్న అప్రస్తుతం. ఎందుకంటే విషయం దానికి సంబంధించి కాదు. అది వేరే సబ్జెక్టు. అసలు విషయం ఏమిటంటే… ప్రస్తుతం సబ్ ఎడిటర్ ఉద్యోగ జీవితం రోడ్డు పాలైంది. కరోనా పుణ్యమా అని చాలా మంది సబ్ ఎడిటర్లు వీధిన పడ్డారు. మాట మాత్రం కూడా చెప్పకుండా ఖర్చులు తగ్గించుకునే నెపంతో అనేక మీడియా సంస్థలు సబ్ ఎడిటర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నాయి. జిల్లా అనుబంధాలు (టాబ్లాయిడ్స్) ఎత్తివేశాయి. సాక్షి, నమస్తే తెలంగాణా పత్రికలు మాత్రమే ప్రస్తుతం టాబ్లాయిడ్స్ ను కరోనా పరిణామాల్లోనూ పునరుద్ధరించాయి. కానీ ఈ పునరుద్ధరణకు ముందే ‘నమస్తే తెలంగాణా’ యాజమాన్యమే కాదు చాలా మీడియా సంస్థలు పెద్ద సంఖ్యలోనే సబ్ ఎడిటర్లను ఇంటికి పంపించేశాయి. దాదాపు రూ. 25 వేల వేతనం గల సబ్ ఎడిటర్లు చాలా మంది ఈ పరిణామాల్లో రోడ్డున పడ్డారు.
ఇప్పుడీ సబ్ ఎడిటర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే కరోనా జర్నలిస్టుల జీవితాలను ఎటువంటి కల్లోల పరిస్థితుల్లోకి నెట్టిందో బోధపడి గుండె ద్రవించకమానదు. రూ. పాతిక వేల వేతనం గల సబ్ ఎడిటర్లు రూ. 2,500 లైన్ ఎకౌంట్ కూడా గిట్టుబాటు కాని ‘కంట్రిబ్యూటర్’ (మండల స్థాయి విలేకరి)గా మారుతుండడమే అసలు విషాదం. తిరగబడిన జర్నలిస్టు జీవితానికి ఇది ప్రబల నిదర్శనం. మీడియా యాజమాన్యాలు తొలగించిన అనేక మంది సబ్ ఎడిటర్లు ప్రస్తుతం కంట్రిబ్యూటర్ విధుల నిర్వహణకు పోటీ కూడా పడుతున్నారు.
ఈమేరకు పత్రిక ముఖ్య బాధ్యులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కనీసం ఫలానా మండల కేంద్రానికి కంట్రిబ్యూటర్ గా నియమించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ అంశంలో కొందరు సబ్ ఎడిటర్ల వినతిని మన్నించిన ‘నమస్తే తెలంగాణా’ ముఖ్య బాధ్యులు వారికి కంట్రిబ్యూటర్లుగా ‘దయ’ తలచి అవకాశం కల్పించడం గమనార్హం. తాము పనిచేసిన సంస్థలో ‘కంట్రిబ్యూటర్’ ఛాన్స్ కూడా లభించని మరికొందరు సబ్ ఎడిటర్లు పెద్దగా వెలుగులోకి రాని ఇతర పత్రికల్లో కూడా మండల స్థాయి విలేకరులుగా చేరుతున్నారు.
ఇంతకీ సబ్ ఎడిటర్ నుంచి కంట్రిబ్యూటర్ హోదాలోకి మారుతున్నవారి ‘బతుకు దెరువు’ పరిస్థితి ఏమిటీ అంటారా? అయితే తాజా పరిణామాలను తప్పకుండా తెలుసుకోవలసిందే. నెలసరి ఓ పదిహేను పత్రికలకు వార్షిక చందాలను కట్టించాలి. పత్రికకు రూ. 1,600 చొప్పను రూ. 24 వేల మొత్తాన్న వసూల్ చేసి పత్రిక సర్క్యులేషన్ పెంచాలి. ఇందుకు ప్రతి పత్రికకు రూ. 300 చొప్పున రూ. 4,500 కమిషన్ చెల్లిస్తారు. అదే విధంగా కనీసం రూ. 20 వేల యాడ్ రెవెన్యూ తీసుకురావాలి. ఇందుకు పదిహేను శాతం కమిషన్ చొప్పున రూ. 3,000 వరకు లభిస్తుంది. అంటే మొత్తంగా ఆయా రూపేణా రూ. 7,500, వార్తలు రాసినందుకు సుమారుగా రూ. 2,500 వరకు లైన్ ఎకౌంట్ కింద వెరసి మొత్తంగా నెలసరి ఓ పది వేల వరకు మాజీ సబ్ ఎడిటర్, తాజా కంట్రిబ్యూటర్ కు ఆదాయంగా లభించవచ్చు.
అంటే తాను పనిచేస్తున్న సంస్థకు నెలకు యాడ్స్, సర్క్యులేషన్ పరంగా కనీసం రూ. 44 వేల మొత్తాన్ని వసూల్ చేసి ఇస్తే మాత్రమే ఆయా రూ. 10 వేలు ‘కంట్రిబ్యూటర్’కు లభించే అవకాశం ఉంది. ఈ పనుల నిర్వహణలో తన ‘సత్తా’ చూపలేని వారిని సంస్థ కనీసం కంట్రిబ్యూటర్ గా కూడా కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చు. ఆ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు తమ అంతర్గత మెసేజ్ ద్వారా ఇప్పటికే స్పష్టీకరించారు కూడా.
ఈ మొత్తం పరిణామాల్లో కొసమెరుపు ఏమిటంటే మాజీ సబ్ ఎడిటర్లు ‘జర్నలిజపు బతుకు’ను కొసాగించేందుకు తమ హోదాను మండల స్థాయి విలేకరిగా దిగజార్చుకుంటున్న తీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంట్రిబ్యూటర్ల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించడం. ఇంతకీ జర్నలిజంలో ఇది తిరోగమనమా? పురోగమనమా? జర్నలిజంపై ఇంకా భ్రమలు గల వారికి విషయం అర్థమవుతున్నట్లేగా!?