తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 19 వరకు అమల్లో గల లాక్ డౌన్ ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది. అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో జూలై 1 నుంచి ప్రారంభించాలని కూడా కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. విద్యాసంస్థలు ఫిజికల్ గానే పునః ప్రారంభమవుతాయని, ఆన్ లైన్ క్లాసులు కొనసాగించడం…తప్పనిసరి హాజరు తదితర నిబంధనలు, విధి విధానాలకు సంబంధించి పూర్తిస్థాయి ఆదేశాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు అందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది.

ఈ మేరకుప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని ప్రభుత్వం కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

Comments are closed.

Exit mobile version