దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి లేఖ రాశారు.

గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు.

‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తన లేఖలో ఆకాంక్షించారు.

Comments are closed.

Exit mobile version