పల్లె ప్రగతిపై నిర్వహించిన కలెక్టర్ల సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్ లో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందిందన్నారు. వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలబడాలని సీఎం కేసీఆర్ కోరారు. అదేవిధంగా పంచాయితీ రాజ్ మున్సిపల్ చట్టాల ప్రకారం పల్లెలు, పట్టణాల్లో జరిగే లే అవుట్లలో ప్రజా అవసరాలకోసం కేటాయించిన భూమిని విధిగా గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్ధిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల తర్వాత నిర్దేశించిన ఏ పనీ పెండింగులో ఉండటానికి వీల్లేదని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఇంతగా సహకరిస్తున్నా కూడా పనులు ఇంకా ఎందుకు పెండింగులో ఉంటున్నాయో అధికారులు పునః సమీక్ష చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున డోర్ టు డోర్ పంపిణీ చేసి నాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పంటలు పండుతూ దేశ ధాన్యాగారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరంగా పేర్కొంటూ రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలన్నారు.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ఇజెడ్ (సెజ్) లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని, సెజ్ ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని సీఎం ఆదేశించారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో కల్తీ విత్తనాల అమ్మకాలను అరికట్టాలన్నారు. ఈ విషయంపై కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డే ను పాటించాలని, ప్రజలను చైతన్య పరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేసి కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments are closed.

Exit mobile version