కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణా రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏవేని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని సీఎం చెప్పారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణను రూపొందించామన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదన్నారు.

వ్యాక్సిన్ వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలన్నారు. పది, పదిహేను రోజుల పాటు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణను రూపొందించాలని, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికేగాక, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం జాబితాను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Comments are closed.

Exit mobile version