వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని సీఎం అన్నారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు.
గత యాసంగిలో మార్క్ ఫెడ్ 9 లక్షల టన్నుల మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు. దీనికోసం రూ. 1668 కోట్లు ఖర్చు చేసిందని, ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల కేవలం రూ. 823 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని, మార్క్ ఫెడ్ కు మొత్తంగా 845 కోట్ల నష్టం వచ్చిందన్నారు. క్వింటాలుకు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్ ఫెడ్ మక్కలను కొన్నదని, సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాలుకు రెండు వేల రూపాయలు ఖర్చయిందన్నారు. కానీ వేలంలో వచ్చింది క్వింటాళుకు కేవలం 1,150 రూపాయలు మాత్రమేనని, క్వింటాలుకు 850 రూపాయల నష్టం వచ్చిందన్నారు. మక్కలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని సీఎం అన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరిందన్నారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపుకు అంతర పంటగా కొద్ది పాటి ఎకరాల్లో మక్కలు వేసుకోవాలని సూచించిందన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది రైతులు మక్కలు సాగు చేశారన్నారు. మక్కలకు మద్దతు ధర రాదని తెలిసినా సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. రైతు సంక్షేమం – వ్యవసాయాభివృద్ధి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నదని, రైతులను సంఘటిత శక్తిగా మలిచిందన్నారు. రైతులను సమన్వయ పరిచి దేశంలోనే మొదటి సారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలు అవుతున్నదని, ఎవరూ అడగక ముందే, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల భూమలు వద్ద లక్ష కల్లాల నిర్మాణం చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,600 రైతు వేదికలను నిర్మిస్తున్నదని, ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేక మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు