ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇడబ్ల్యుఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.