మార్చి 14న రిలే నిరాహార దీక్ష
ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోపాల్ వెల్లడి

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన తమ ధ్యేయమని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోపాల్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆర్యవైశ్యులకు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయల నిధులను కూడా హామీ మేరకు కేటాయించాలని వారు కోరారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేళ్లచెర్వు వెంకటేశ్వర్ రావు, వనమా వేణుగోపాల్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కోసం ఈనెల 14న ఖమ్మం ధర్నాచౌక్ లో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వారు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ధర్నాలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రిలే నిరాహారదీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో 35 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారని, వారిలో అనేకమంది పేదలు, మధ్యతరగతి వారు ఆర్థిక ఇబ్బందులతో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల సంక్షేమాభివృద్ధికోసం తాము మూల స్తంభంగా ఉన్నామని, వారికి ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆశయ సాధనకోసం ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమని అన్నారు. ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ, దైవాన్ని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాటకు కట్టుబడి వెయ్యి కోట్ల నిధులతో పూర్తి చట్టబద్ధత కల్పించి “తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్” ను వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ నగర అధ్యక్షుడు గోళ్ళ రాధాకృష్ణ, ప్రధానకార్యదర్శి గుమ్మడివెళ్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మాశెట్టి వరప్రసాద్, కార్యనిర్వహక అధ్యక్షుడు వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, సభ్యులు కొంకిమల్ల మృత్యుంజయరావు, వెంపటి జగదీష్, ఆవోపా కృష్ణమూర్తి, విన్నమూరి సుబ్బారావు, బూర్ల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version