తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణల ప్రయివేట్ సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీసీసీ అధ్యక్షునిగా నియమితమైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి శనివారం ఏబీఎన్ అధినేత రాధాకృష్ణతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణగా పేర్కొంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తెలంగాణా సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడి ప్రస్తావన ఈ వీడియోలో ఉండడం గమనార్హం. తమ మీడియా సంస్థతోపాటు మరో న్యూస్ ఛానల్ కూడా తెలంగాణాలో కేసీఆర్ కంట్రోల్ లో ఉన్నట్లు ఏబీఎన్ రాధాకృష్ణ చేసినట్లు వినిపిస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మాారాయి. అంతేకాదు చంద్రబాబు తనయుడు లోకేష్ గురించి కూడా ఏబీఎన్ రాధాకృష్ణ ప్రస్తావించినట్లు వినిపిస్తోంది. అయితే ఈ వీడియోలోని సంభాషణకు సంబంధించిన అంశాలు అస్పష్టంగానే ఉండడం గమనార్హం.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాటలు కూడా క్లారిటీగా వినిపించడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగానూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, రాధాకృష్ణల మధ్య జరిగిన ప్రయివేట్ సంభాషణ వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version