ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ పాత్రను పోషించారని పార్లమెంటులో టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శ్లాఘించారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల నామా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన పాత్ర మరువలేనిదన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు.
15వ లోక్ సభలో ‘లీడర్ ఆఫ్ ద హౌస్’గా ఆయన ఉన్న సమయంలో ప్రణబ్ తో పాటు కలసి పని చేసిన విషయం ఈ సందర్భంగా ఎంపీ నామ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసేటప్పుడు ఎప్పుడూ తన మద్దతు తెలిపేవారన్నారు.
రాష్టప్రతి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బిల్లుపై రాజముద్ర వేయటం రాష్ట్ర ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని, ప్రణబ్ ముఖర్జీ గొప్ప నాయకుడు, మేధావి, ట్రబుల్ షూటర్ అని నామా పేర్కొన్నారు
ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నామా నాగేశ్వరరావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఫొటో: ప్రణబ్ ముఖర్జీతో ఎంపీ నామా నాగేశ్వరరావు (ఫైల్)