కరోనా బాధితులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు భారీ మొత్తపు విరాళాన్ని అందించారు. ఈమేరకు కరోనా బాధితుల సహాయార్ధం ఆరు అంబులెన్స్ లకు రూ. 1.23 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్ కు నామా శనివారం అందజేశారు.
కోవిడ్ నేపథ్యంలో వైద్యం మరెంత మెరుగ్గా ప్రజలకు చేరువయ్యేందుకు తన వంతుగా ఈ ఆరు అంబులెన్స్ లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నామా చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగా తన వంతుగా కరోనా బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించడానికి ఈ అంబులెన్స్ లను వైద్య, ఆరోగ్య శాఖకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెంలలోని కరోన బాధితులకు ఈ ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా త్వరలో సేవలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
అలాగే ఈ అంబులెన్స్ లను ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమయం వృధా కాకుండా బాధితులను నిర్ణీత సమయంలో (గోల్డెన్ అవర్) హాస్పిటల్ కు తీసుకువెళ్ళడంతో పాటుగా ప్రాణాపాయం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని నామ పేర్కొన్నారు.
కాగా ఆరు అంబులెన్స్ ల కొరకు చెక్ ఇచ్చిన ఎంపీ నామ నాగేశ్వరరావును మంత్రి కేటీఆర్ ఈ సందర్బంగా అభినందించారు.
నామా వెంట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కూడా ఉన్నారు.
ఫొటో: మంత్రి కేటీఆర్ కు చెక్కును అందజేస్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు