మందు తయారీ, పంపిణీపై ఆనందయ్యతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఆర్డివో హుస్సేన్ సాహెబ్ గారు, రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డిలతో కలిసి మీడియాకు వివరాలు అందించారు.

ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో మందు తయారీ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి సమావేశమైనట్లు ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డిచ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఆనందయ్య అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సజావుగా, సాఫీగా మందు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

మందు తయారీలో గానీ, పంపిణీలో గానీ ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆనందయ్య మందు నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో అవసరమైన వారందరికీ పంపిణీ చేయడంతో పాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి కూడా వివిధ పద్ధతుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ఆనందయ్య మందు కోరుకునే వారికి, ఇతర జిల్లాలోని అధికార యంత్రాంగానికి అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కోవిడ్ నిబంధనలు పాటించి పంపిణీ చేయడానికి ఆయా ప్రాంతాల ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటే అవసరమైన మందు తయారు చేసి అందిస్తామన్నారు.

మందు వ్యక్తిగతంగా కోరుకునే వారికి పోస్టు ద్వారా, కొరియర్ సర్వీస్ ద్వారా, ఆన్లైన్ ఆర్డర్ ద్వారా అందించడంతో పాటు, ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వారికీ కూడా నేరుగా అందించే ఏర్పాటు చేస్తామని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. కృష్ణపట్నంలో గానీ, నెల్లూరులో గానీ నేరుగా ఆనందయ్య మందు పంపిణీ చేసే అవకాశం లేనందున దయచేసి ఎవ్వరూ ఆయా ప్రాంతాలకు తరలిరావద్దని కోరారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, కరోనా సోకిన వారికి వెంటనే మందు అందించడంతోపాటు, కరోనా నివారణకు కూడా అవసరమైన మందు తయారు చేసి పంపిణీ చేస్తామన్నారు. కళ్లలో వేసే డ్రాప్స్ కు సంబంధించి, హైకోర్టులో రిట్ పెండింగ్ లో ఉన్నందున కోర్టు తుది ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రజలందరూ కోవిడ్ నేపథ్యంలో నియమ, నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి చెందకుండా కరోనా నివారణకు సహకరించాలని కోరారు. ఆనందయ్య మందుపై అధ్యయనం జరిపించి అనతికాలంలోనే అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఆనందయ్య మందు పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో పాటు, తోడ్పాటునందిస్తున్న ఇతర అధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఆయుర్వేదంలో అపారమైన అనుభవం ఉన్న ఆనందయ్య కరోనా నివారణకు, కరోనా నిర్మూలన కోసం చేస్తున్న కృషికి అభినందనలు. తెలుపుతున్నట్లు గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Comments are closed.

Exit mobile version