బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పీఏ చిరుమామిళ్ల రవికిరణ్ మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు.

ప్రజా సేవలో నిమగ్నమైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వ్యక్తిగత సహాయకుడిగా, ప్రజలకు మంత్రికి మధ్య వారధిగా సేవలందిస్తున్న తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తరుచుగా తన వద్దకు పలువురు మంత్రి సాయం కోరుతూ వస్తుంటారని చెబుతూ, ఈ సందర్భంగా తమ మధ్య అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటామే తప్ప మరే విధంగా కుటుంబ బంధుత్వం ఉండదని అన్నారు.

మైనింగ్ వ్యాపారం అంటూ నీతిలేని రాజకీయానికి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు తెరతీసి తనను బలి చేసే కుట్ర పన్నారని, దీనిలో పలువురు బీజేపీ అనుబంధ మీడియా ప్రతినిధులు ఉన్నారని ఆరోపించారు. తాజాగా ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టి తాత్కాలికంగా పబ్బం గడిచిపోతే చాలునని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని రవి కిరణ్ పేర్కొన్నారు

Comments are closed.

Exit mobile version