‘సిట్టింగ్ లను మార్చిన చోట మనం గెలిచాం. మార్చనిచోట చాలా మంది ఓడిపోయారు. ఇక్కడే మన లెక్క తప్పింది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందాం.’ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలివి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవి చూసిన అధికార పార్టీ అందుకు దారి తీసిన పరిణామాలపై విశ్లేషణ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే నిన్న తెలంగాణా భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ‘సిట్టింగ్’ కార్పొరేటర్ల మార్పునకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 26 మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు పార్టీ టికెట్లు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయా స్థానాల్లో మార్చిన అభ్యర్థుల్లో 21 మంది విజయం సాధించారు. మరో పాతిక స్థానాల్లోనూ సిట్టింగ్ కార్పొరేటర్లను మారిస్తే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఖమ్మం నగర పాలక సంస్థలోని అనేక మంది కార్పొరేటర్లలో గుబులు కలిగిస్తున్నాయి.
‘ప్రజాభిప్రాయ సేకరణ’ పేరుతో గత అక్టోబర్ నెలలో లీకైన ఓ సర్వే నివేదికకు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. గత సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు కార్పొరేటర్ల పనితీరు ప్రామాణికంగా ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 62 పేజీలతో గల ఈ ‘సర్వే’ డాక్యుమెంట్ గత అక్టోబర్ నెలలో ఖమ్మం నగర రాజకీయాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ సర్వే నివేదికను క్లుప్తంగా మరోసారి మననం చేసుకుంటే… ఖమ్మం నగర పాలక సంస్థలో మొత్తం యాభై డివిజన్లు ఉండగా, వచ్చే మార్చిలో జరిగే ఎన్నికల్లో 46 డివిజన్లలో అధికార పార్టీ గులాబీ జెండాను ఎగురవేస్తుందని, డివిజన్లను పునర్విభజించి 60కి పెంచినా 55 డివిజన్లు ‘కారు’ ఖాతాలో పడతాయని కూడా సర్వేలో తేలినట్లు అధికార పార్టీ అనుకూల మీడియా సంస్థలు తమ వార్తా కథనాలను వడ్డించాయి. కానీ ఆయా అంశాలేవీ సర్వే నివేదికలో లేకపోవడమే అసలు విశేషం. లీకైన సర్వే నివేదికను నిశితంగా పరిశీలించినపుడు మొత్తం 50 డివిజన్లలో 11 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల పనితీరుపై మాత్రమే ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందులో ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ‘బెటర్ పర్ఫార్మెన్స్’ను ప్రదర్శించగలిగారు. మొత్తంగా తొమ్మిది మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రమే ‘గుడ్’ అనిపించుకున్నారు.
అదేవిధంగా ‘యావరేజ్’ మార్కులు సంపాదించుకున్న 25 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లలో 21 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. పనితీరులో ‘అసంతృప్తి’ మార్కులు సంపాదించుకున్న 14 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లలో 12 మంది అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. అనేక మంది కార్పొరేటర్లు ‘బ్యాడ్ ఇమేజ్’ను సొంతం చేసుకున్నారని సర్వే నివేదిక పేర్కొంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు అధికార పార్టీకి చెందిన 33 మంది కార్పొరేటర్ల పనితీరు బాహాటంగానే ప్రస్ఫుటమమైంది. ఇందులో 12 మంది ‘బ్యాడ్ ఇమేజ్’ను కలిగి ఉండగా, మిగతా 21 మంది ‘యావరేజ్’ ఇమేజ్ మాత్రమే కలిగి ఉన్నారు. కేవలం 9 మంది కార్పొరేటర్ల పనితీరుకు మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణలో ‘గుడ్’ మార్కులు పడ్డాయి. ఇందులో కేవలం ముగ్గురంటే ముగ్గురు కార్పొరేటర్లే ‘బెటర్ ఫర్ఫార్మెన్స్’ కలిగి ఉన్నారు.
ఇక కార్పొరేటర్ల పనితీరుపై 26.16 శాతం మాత్రమే ప్రజలు ‘గుడ్’ అన్నారు. మరో 42.05 శాతం మంది ‘యావరేజ్’ మార్కులు వేశారు. మరో 31.79 శాతం మంది ‘పూర్’ అంటూ తమ భావాలను సర్వేలో పంచుకున్నారు. అంతేకాదు 13 డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల ‘వ్యవహార తీరు’ను కూడా సర్వే నివేదికలో ప్రస్తావించారు. ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు, దురుసు ప్రవర్తన వంటి అంశాల కారణంగా మంచి ‘ఇమేజ్’ను సొంతం చేసుకోలేకపోయారని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ కు త్వరలో జరిగే ఎన్నికల్లో ఎంతమంది ‘సిట్టింగ్’లకు మళ్లీ పార్టీ టికెట్లు లభిస్తాయనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ‘జోష్’తో ఖమ్మం ఖిల్లా వైపు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. రాజకీయంగా పావులు కూడా కదుపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ‘బ్యాడ్’ ఇమేజ్ సంపాదించుకున్న సిట్టింగ్ కార్పొరేటర్లను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఆయా కార్పొరేటర్ల రాజకీయ భవితవ్యంపై భిన్నాభిప్రాయాలకు తావు కల్పిస్తున్నాయి.