కొండా సురేఖ..తెలంగాణా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి..ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ పుస్తకాన్ని ఎవరైనా రచిస్తే కొండా సురేఖ దంపతుల నేపథ్యానికి ప్రత్యేక పేజీలు ఉంటాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీసిన పొలిటికల్ చరిత్ర కొండ సురేఖ దంపతుల ప్రస్థానం.. రాజకీయాల్లో డక్కీలు, మొక్కీలు తిన్న కొండ సురేఖ ఓ మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు చివరికి బేషరతు ‘ఉపసంహరణ’కు దారి తీయడమం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ లో చిన్న లాజిక్ ను మర్చిపోయి, రాజకీయంగానే కాదు, సినీ వర్గం ప్రముఖులతోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి సురేఖకు ఏర్పడింది.
నిజానికి రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం కొండా సురేఖ కుటుంబానికి కొత్తేమీ కాదు. గీసుగొండ మండలం వంచనగిరి సర్పంచ్ పదవి నుంచి మొదలైన సురేఖ దంపతుల పొలిటికల్ హిస్టరీ చిన్నదేమీ కాదు. రాస్తే వందల పేజీల పుస్తకంగా మారుతుంది. కాకలు తీరిన ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నాయకునితో రాజకీయంగా తలపడిన ఘటనలు అనేకం. నళిన్ ప్రభాత్ వంటి ఐపీఎస్ అధికారుల నుంచి చేదు ఘటనలను చవి చూసిన అనుభవం కూడా సురేఖ కుటుంబానికి ఉంది. మంచీ, చెడూ.. గురించి పూర్తి అవగాహన ఉన్న కొండా సురేఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. కానీ చివరికి ఈ పరిణామం సురేఖకే బూమరాంగ్ గా మారిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సినీ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను ఉపసింహరించుకుంటున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాస్తవానికి మొత్తం ఎపిసోడ్ లో తొలుత సానుభూతి దక్కించుకున్న మంత్రి సురేఖ నిన్న చేసిన వ్యాఖ్యల కారణంగా అభాసుపాలయ్యారనే విమర్శలు లేకపోలేదు. అసలేం జరిగిందనే నేపథ్యాన్ని క్తుప్తంగా సమీక్షిస్తే.. మంత్రి కొండా సురేఖ సిద్ధిపేట పర్యటనలో బీజేపీ ఎంపీ రఘునందనరావు ఆమె మెడలో నూలు దండ వేసిన ఫోటో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. దీని వెనుక కేటీఆర్ ఉన్నారనేది కొండా సురేఖ ఆరోపణ. ఈ పరిణామం ఇరువురి మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. కొండా సురేఖ అభిమానులు గులాబీ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. కెటిఆర్ పర్యటనను అడ్డుకుని కారును స్వల్పంగా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కు బానిసైన కేటీఆర్ సినీ హీరోయిన్లను వేధించాడని, ఆయన వేధింపులు తట్టుకోలేక చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీ వదలి వెళ్ళిపోయి పెళ్లిళ్లు చేసుకున్నారని ఆరోపించారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కూడా కేటీఆర్ అని ఆమె ఆరోపించారు. పనిలో పనిగా నాగార్జున కుటుంబంపైనా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖపై ఫొటో ట్రోలింగ్ అంశంపై కేటీఆర్ కూడా తనదైన శైలిలోనే స్పందించారు. ‘కొండా సురేఖ దొంగ ఏడుపులు దేనికి? మీ వరకు వస్తే తప్ప బాధ తెలిసిందా? గతంలో నాకు సినీ హీరోయిన్లకు ఏదో ఉందని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళు బాధ పడలేదా? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. మరోవైపు సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎలాంటి వేధింపులు లేవని, రాజకీయాలకు దూరంగా వుండే సినిమా వ్యక్తులను వారి జీవితాలను ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని సురేఖకు హితవు చెప్పారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని, తన కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని ఆయన నాగార్జున అన్నారు. మహిళా మంత్రిగా బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు.
సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత తన ఇష్టాగ్రామ్ ఖాతాలో స్పందించారు. నాగ చైతన్య తాను విడాకులు తీసుకోవడం పూర్తిగా తమ వ్యక్తిగతమని, దయచేసి రాజకీయం చేయొద్దని హితవు పలికారు. గ్లామరస్ సినిమా ప్రపంచంలో హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదని, ఎంతో శక్తి, ధైర్యం కావాలనే విషయం మహిళా మంత్రిగా మీరు తెలుసుకోవాలని, దయచేసి మహిళలను చిన్న చూపు చూడొద్దని సమంత కోరారు.
అంతేకాదు సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి హీరోలేగాక సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యాలను తీవ్రంగా ఆక్షేపించారు. నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా నిన్ననే స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల్లో సురేఖ అనివార్యంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సమంత మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని, మహిళల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమేనని అన్నారు. తన వ్యాఖ్యలపట్ల సమంతగాని, ఆమె అభిమానులుగాని మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మొత్తంగా వివాదాన్ని పరిశీలించినపుడు కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ నేపథ్యానికి ఒకింత నష్టంగానే పరిశీలకులు భావిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ తన ఫోటో ట్రోలింగ్ పై ఆవేదన చెందడంలో తప్పు లేకపోవచ్చు.. కానీ రాజకీయంతో సంబంధంలేని సినిమా హీరోయిన్లను వివాదంలోకి లాగి చేసిన వ్యాఖ్యలే తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ రకంగా చెప్పాలంటే ఫొటో ట్రోలింగులో తొలుత సానుభూతిని పొందిన మంత్రి సురేఖ నిన్నటి వ్యాఖ్యలతో ఆత్మరక్షణలోకి వెళ్లారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు వచ్చినా హుందాగా ఉంటూ సంయమనం పాటించాలి. అంతేకాదు ఆమె అధికార పార్టీలోనే ఉన్నారు. మంత్రి హోదాలో ఉన్నారు. తనకు జరిగిన అన్యాయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించి, దర్యాప్తు చేయించి దాని వెనకాల ఉన్నవారెవరో కనిపెట్టడం అంతపెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే.. ట్రోలింగ్ నిందితులను అరెస్టు చేయిస్తే, వాళ్ల వెనకాల ఉన్నవాళ్లెవరో తెలిసిపోయేది. చట్టపరంగా సూత్రధారులనూ అరెస్టు చేయించే పవర్ అధికారికంగా ఆమె చేతిలోనే ఉంది. ఈ చిన్న లాజిక్ ను మర్చిపోయి, కేటీఆర్ టార్గెట్ గా మధ్యలోకి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ సమంతను, ఇతర నటీమణులను లాగి సురేఖ చేసిన వ్యాఖ్యలు ‘బూమరాంగ్’గా మారాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.