వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? ఓ వైపు వరుస వివాదాలు, మరోవైపు సొంత జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆమె వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వరకు పయనించే అవకాశముందనే వార్తలు మంత్రి సురేఖను దైవదర్శనానికి తీసుకువెడుతున్నాయా? అనే ప్రశ్నలు తాజా పరిస్థితుల్లో రేకెత్తుతున్నాయి. ఒకదాని వెంట మరొకటిగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఆమె రాజకీయ భవితవ్యంపై భిన్న చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసుకుంటున్న వరుస దైవ దర్శనాలు సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
దేవాదాయ శాఖ మంత్రిగానే కాదు.. ఓ భక్తురాలిగా ఆమె ఎప్పుడైనా, ఏ దైవాన్నయినా దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.. తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ వరుస వివాదాలు, కోర్టు కేసులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సరిపడని రాజకీయ వాతావరణం తదితర అంశాల నేపథ్యంలో మంత్రి సురేఖ వరుస దైవర్శనాల ఉదంతాలు సహజంగానే చర్చనీయాంశంగా మారుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగుతూ చేసిన వ్యాఖ్యలు, అనంతర పరిణామాల్లో పరువు నష్టం కేసుల దాఖలు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితోనేగాక, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సఖ్యత లేని పరిణామాలు రాజకీయంగా సురేఖను ఉక్కిరి బిక్కిరికి గురిచేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆమె సంప్రదాయక పద్ధతిలో వరుస దైవ దర్శనాలు చేసుకోవడం విశేషం.
గత సోమవారం వేములవాడ రాజన్నను, బుధవారం వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్నారు. నిజానికి అటు వేములవాడ రాజన్నను, ఇటు మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు సంప్రదాయక పద్ధతి ఉండడం గమనార్హం. మేడారం తల్లులను దర్శించుకోవడానికి ముందు భక్తులు ఖచ్చితంగా వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా వనదేవతలకు మొక్కులు అప్పజెప్పే భక్తులు తప్పనిసరిగా ఈ విధానాన్ని పాటిస్తారు. వేములవాడ రాజన్న దర్శనం చేసుకోకుండా సమ్మక్క భక్తులెవరూ మేడారం వెళ్లరు. ఇది జాతర ఆవిర్భావం నుంచీ వస్తున్న ఆనవాయితీ, ఆచారం కూడా.
మంత్రి కొండా సురేఖ కూడా ఇదే ఆనవాయితీని ఆచరించడం గమనార్హం. గత సోమవారం వేములవాడ రాజన్నను ఆమె దర్శించుకుని తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానూ సురేఖ వివాదంలో చిక్కుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారికి నివేదన సమర్పించాల్సి ఉండగా, మంత్రి సురేఖ అదే సమయంలో ప్రత్యేక పూజలు చేయడంతో స్వామివారికి నివేదన అరగంట ఆలస్యమైంది. ఈ ఉదంతంపై కూడా సురేఖపై మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి.
ఆయా వివాదం సంగతి ఎలా ఉన్నప్పటికీ, నిన్న.. అంటే బుధవారం మంత్రి సురేఖ మేడారం వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లులకు బుధ, గురు, శుక్రవారాలు మాత్రమే ప్రీతిపాత్రం. ఈ మూడు రోజుల్లోనే తల్లులకు మొక్కులు సమర్పించే పద్ధతి ఉంది. భక్తులు కూడా ఎక్కువగా ఈ రోజులకే ప్రాధాన్యతనిస్తుంటారు. మంత్రి సురేఖ కూడా వేములవాడ రాజన్నను సోమవారం, మేడారం అమ్మవార్లను బుధవారం దర్శించుకుని మొక్కులు సమర్పించారు.
అంతేకాదు మేడారం సమ్మక్క తల్లిని తమ కులదైవంగా మంత్రి సురేఖ వెల్లడించారు. తమ అత్తమ్మకు సమ్మక్క తల్లి పూనకం వచ్చేదని, కుటుంబ ఆచారం ప్రకారం తమ వంశోద్ధారకుడైన మనవడి తలనీలాలు సమర్పించి వనదేవతల మొక్కులు చెల్లించుకున్నట్లు మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తంగా వరుస వివాదాలు, తాజా రాజకీయ పరిణామాల్లో మంత్రి కొండా సురేఖ దైవదర్శనాలు చేసుకుంటున్న అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేములవాడ రాజన్నతోపాటు కుల దైవమైన మేడారం సమ్మక్క తల్లి తమ అభిమాన నాయకురాలిని వివాదాల సుడిగుండం నుంచి కాపాడుతారనే విశ్వాసాన్ని మంత్రి సురేఖ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడ రాజన్నను, మేడారం వన దేవతల దర్శనం అనంతరం కొండా సురేఖ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు…