తెలంగాణా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బీఎన్ఎస్ లోని క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్ 356 కింద చట్టానికి చిక్కినట్టేనా? సినీ హీరో అక్కినేని నాగార్జున మంత్రిపై దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ దావాలోని సెక్షన్ ఏం చెబుతోంది? ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత్ లోని సెక్షన్ 356 కింద కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఈ సెక్షన్ ఏం చెబుతోంది? నాగార్జున దావాను కోర్టు విచారణకు స్వీకరించి, విచారణలో నేరారోపణ రుజువైతే మంత్రి కొండా సురేఖకు పడే శిక్ష ఏమిటి? వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి.
గత జూలై 1వ తేదీ నంచి భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్), సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) గత జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నిరుడు పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టాలు అమలవుతున్నాయి.
బ్రిటిష్ కాలంనాటి చట్టాల్లో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందనే అంశం ఒకింత గందరగోళంగా ఉండేది. వాటిని సరళతరం చేస్తూ ఐపీసీలోని 511 సెక్షన్ల సంఖ్యను బీఎన్ఎస్ లో 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య గల పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తీసుకువచ్చారు. మూడు నెలల క్రితం నుంచి అమలవుతున్న బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద మంత్రి కొండా సురేఖపై నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా ఆమెకు చిక్కులు తెచ్చినట్లుగానే న్యాయకోవిదులు చెబుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని సినిమా వ్యక్తులను మంత్రి సురేఖ వివాదంలోకి లాగకుండా ఉండాల్సిందనే వ్యాఖ్యలు న్యాయవాద వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయంగానే న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సినీ వర్గాల నుంచేగాక, ఇతర వర్గాల నుంచి కూడా నిరసన వ్యక్తం కావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ ప్రకటించినా నాగార్జున శాంతించకపోవడం గమనార్హమని అంటున్నారు.
తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ చేసిన ప్రకటన పశ్చాత్తాపం కింద పరిగణించినా, ఆమె చేసిన వ్యాఖ్యలు ‘వ్యక్తిత్వ హననం’గా న్యాయకోవిదులు అభివర్ణిస్తున్నారు. నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన దావాలో అక్కినేని నాగార్జున సురేఖపై క్రిమినల్ చర్యలకు మాత్రమే అభ్యర్థించడం గమనార్హం. నిజానికి ఈ ఘటనలో నష్టపరిహారాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చని, ఆ దిశగా కాకుండా క్రిమినల్ డిఫమేషన్ మాత్రమే దాఖలు చేశారంటే తన కుటుంబ పరువుపై నాగార్జున ఎంతగా ఆవేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవచ్చని న్యాయ కోవిదులు విశ్లేషిస్తున్నారు.
నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ దావాను కోర్టు పరిగణనలోకి తీసుకుని విచారణకు స్వీకరిస్తే కొండా సురేఖకు చిక్కులు తప్పవంటున్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ఆమె చేసిన ప్రకటన సారాంశం పశ్చాత్తాపం కోణంలోనే కాదు, నేరాంగీకారంగా కూడా భావించవచ్చని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి. ఏవేని సాంకేతిక కారణాలుంటే తప్ప నాగార్జున దావాను కోర్టు స్వీకరించి విచారణ జరిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద నేరం రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చని చట్టం నిర్దేశిస్తోంది.