డబ్బుకోసం కిడ్నాప్ లకు పాల్పడుతున్న మహిళ నాయకత్వంలోని ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ముఠాను నిర్వహిస్తూ కిడ్నాప్ లకు పాల్పడుతుండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ముదిగొండ పోలీసులు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం…
ముదిగొండ మండలం గంధసిరికి చెందిన పస్తం ఏసు రాజు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పస్తం రామరాజు అలియాస్ చిన్న గురూజీకి మధ్య గల పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాజును ఎలాగైనా సరే మనుషులను పెట్టి బెదిరించి, కిడ్నాప్ చేయించి అతని దగ్గర నుండి డబ్బు వసూలు చేయాలని పస్తం రామరాజు భావించాడు. ఇందులో భాగంగా తనకు పరిచయం ఉన్న వెంకటగిరికి చెందిన దగ్గుపాటి రమాదేవిని సంప్రదించి ఆమెకు అడ్వాన్సుగా రూ. 50 వేల నగదు ఇస్తాడు.
రమాదేవి తన అనుచరులైన కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్ లకు విషయం చెప్పగా, వారు వసికర్ల సాయి కృష్ణ, కమతం వినీత్ లను మాట్లాడుకుంటారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి పలిమెల ప్రవీణ్ అనే కార్ డ్రైవర్ ను కార్ తీసుకు రమ్మని చెప్పి కుదుర్చుకుంటారు. కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్ లకు అడ్వాన్సు గా రూ. 50 వేలు ఇచ్చి పని కాగానే అడిగినంత డబ్బు ఇస్తానని రామరాజు చెబుతాడు.
పథకం ప్రకారం ఏసు రాజు కదలికలు చెప్పడానికి గంధం అంజయ్య అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఈమేరకు గత నెల 25వ తేదీన ఉదయం గంధసిరిలో కుల పంచాయతీ ఉండగా, దానికి పస్తం ఏసురాజు కూడా వస్తాడు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఏసు రాజు, అంజయ్యతోపాటు ఇంకా కొంత మంది కలిసి కమలాపురం వెళ్లి టిఫిన్ చేసి తిరిగి కారులో గంధసిరి వస్తుండగా, పస్తం రామరాజు ముందుగానే ఏర్పాటు చేసుకున్న కిరాయి గుండాలు కంచర్ల నాగేశ్వరరావు, దాసరి రమేష్, వసికర్ల సాయి కృష్ణ, కమతం వినీత్, పలిమెల ప్రవీణ్ లు కలిసి రాత్రి 8 గంటల సమయంలో మావుళ్ళమ్మ గుడి దగ్గర కారు ఆపుతుండగా, వెనకాలే కారులో వస్తున్న వ్యక్తులు, వారి కారును అడ్డం పెట్టి పస్తం ఏసు రాజును బలవంతంగా కారులో ఎక్కించుని అతడిని కొట్టుకుంటూ ఖమ్మం కొత్త బస్సు స్టాండ్ వద్దకు తీసుకువెళ్లారు.
తమకు లక్ష రూపాయలు ఇస్తేనే వదిలి పడతామని, లేదంటే చంపేస్తామనిని బెదిరించగా, పస్తం ఏసు రాజు భయపడి తన ఫోన్ నుండి కంచర్ల నాగేశ్వర రావు ఫోన్ కు రూ. 60 వేలు ఫోన్ పే ద్వారా పంపించి రెండు రోజుల తరువాత మిగతా డబ్బులు పంపిస్తానని చెప్పగా, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పస్తం ఏసు రాజును బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్లిపోతారు. కిడ్నాప్ పూర్తయిన తరువాత రామరాజు రామాడేవికి రూ. 50 వేలు పంపించాడు. మళ్లీ వీళ్ళంతా కలిసి ఏసురాజును బెదిరించగా, రెండు దపాలుగా రూ. 16,500 మొత్తాన్ని ఫోన్ పే ద్వారా పంపించాడు. అయితే తనను కిడ్నాప్ చేసిన ముఠా ఏదైనా చేస్తారని భయపడి బాధితుడు పిర్యాదు చేయలేకపోయాడు.
ఎట్టకేలకు బాధితుడు పస్తం ఏసురాజు జరిగిన సంఘటన గురించి ఈనెల 8వ తేదీన పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ముదిగొండ దర్యాప్తును ప్రారంభించినారు. రెండు పోలీస్ బృందాలను రంగంలోకి దింపి నిందితుల కోసం వెదుకుతుండగా, గురువారం కిడ్నాప్ ముఠా సభ్యులందరూ కలిసి విజయవాడ వైపు మూడు కార్లలో వెడుతున్నట్లు సమాచారం అందింది.
దీంతో సువర్ణాపురం నుండి కార్లు హైవే రోడ్ ఎక్కే దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. పోలీసుల తనిఖీలను పసిగట్టిన పస్తం రామరాజు, దగ్గుపాటి రమాదేవి, కంచర్ల నాగేశ్వర రావు, దాసరి రమేష్, వసికర్ల సాయి కృష్ణ, కమతం వినీత్, పలిమెల ప్రవీణ్, గంధం అంజయ్య అనే ఎనిమిది మంది ముఠా సభ్యులు కార్లలో పారిపోతుడగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి10 సెల్ ఫోన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమండ్ కు తరలించారు. ఈ ముఠా గతంలో కూడా తొర్రూర్ ఏరియాలో ఇటువంటి నేరాలు చేసినట్లు ముదిగొండ సీఐ మురళి చెప్పారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన యస్. ఐ. జి. నరేష్, ట్రైనీ యస్. ఐ రోహిత్, సిబ్బందిని సీఐ మురళి అభినందించారు.