అవమానం భరించలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసు వర్గాల కథనం ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌కు చెందిన భిక్షపతి, ఉష దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కీసర పరిధిలోని నాగారం వెస్ట్‌ గాంధీనగర్‌ కు వచ్చారు. భిక్షపతి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమార్తె హర్షిణి, కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. పక్కనే గల ఓ ఇంట్లో ఉన్న బాలిక ఒకరి పట్ల భిక్షపతి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని స్థానికుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి అతడిపై కొందరు దాడి చేశారు. అయితే శుక్రవారం ఉదయం విషయంపై పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు. తనపై దాడి ఘటన అవమానం భరించలేక భిక్షపతి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీన్ని భరించలేక తొలుత తన భార్య, పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల కథనం. ఘటనపై స్థానికులు వెంటనే సమాచారం అందించగా, కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments are closed.

Exit mobile version