ఇదో విషాదకర ఘటన. కరీంనగర్ నగరంలోని అల్గునూరు వద్ద గల మానేరు బ్రిడ్జి పైనుంచి ఓ కారు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అనే టీచర్ దుర్మరణం చెందారు. అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. విషయం గురించి సమాచారం అందుకున్న బ్లూ కోట్స్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర శివారులోనే ప్రమాదం జరగడంతో ప్రజలు కూడా భారీగా గుమిగూడి కారు పడిపోయిన దృశ్యాన్ని తిలకిస్తూ సానుభూతిని తెలుపుతున్నారు.
కానిస్టేబుల్ చంద్రశేఖర్ కూడా విధినిర్వహణలో భాగంగా జనాన్ని నియంత్రించే పనిలో ఉన్నారు. అయితే అకస్మాత్తుగా కానిస్టేబుల్ చంద్రశేఖర్ బ్రిడ్జి పైనుంచి దిగువన గల మానేరు నది కాల్వలో పడిపోయారు. ఏం జరిగిందనే విషయం తెలిసేలోగానే కానిస్టేబుల్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని బతికేంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆసుపత్రిలో కానిస్టేబుల్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. కారు ప్రమాద ఘటన వద్ద గుమిగూడిన వారిని ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది.