కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనలో ఇద్దరు ఎస్ఐలు సహా మరో ముగ్గురిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రౌడీషీటర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వికాస్ దూబే ముఠాకు ముందే ఉప్పందించారనే అభియోగంపై ఎన్కౌంటర్ ఘటన జరిగిన చౌబేపూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వినయ్ తివారీని ఇప్పటికే సస్పెండ్ చేసి విచారిస్తున్నారు.
వికాస్ దూబే ముఠాకు సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై తాజాగా మరో ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ పి. దినేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సస్పెన్షన్ వేటు పడినవారిలో ఎస్ఐలు కునర్వాల్, క్రిష్ణకిషోర్ శర్మ, కానిస్టేబుల్ రాజీవ్ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ముగ్గురిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించామని, ఎన్కౌంటర్లో వీరి ప్రమేయమున్నట్లు తేలితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కూడా చెప్పారు. కాగా కిల్లర్ గ్యాంగ్ లీడర్ వికాస్ దూబే ఆచూకీ ఇంకా లభించలేదు.