కనీసం నలుగురు కార్యకర్తలు లేరక్కడ. ఎ:దుకోగాని జనగామ పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముందు లాఠీలకు పని చెప్పి బీజేపీ నాయకున్ని గొడ్డును బాదినట్లు బాదారు. పోలీసులు అతన్ని చుట్టుముట్టి, నెట్టుకుంటూ, కొట్టుకుంటూ జీపులోకి తోశారు. పోలీస్ దెబ్బలకు వాహనంలోకి నెట్టేసిన కార్యకర్తల గొంతులు ఆర్తనాదం చేసినట్లు వీడియోలో వినిపిస్తోంది. ‘ఫ్రెండ్లీ పోలీస్’ అమలు గురించి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతగా చెబుతున్నప్పటికీ, కొందరు పోలీసు అధికారులు చెవికెక్కించుకుంటున్నట్లు లేదు.
ఇంతకీ విషయమేమిటంటే… స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా జనగామ పట్టణంలో బీజేపీ శ్రేణులు జెండాలను కట్టాయట. అయితే పట్ణణంలో భారీగానే కనిపిస్తున్న టీఆర్ఎస్ జెండాలను వదిలేసి, కేవలం బీజేపీ జెండాలను మాత్రమే మున్సిపల్ అధికారులు తొలగించారట. ఇదే విషయంపై ప్రశ్నించడానిక బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మతోపాటు మరో ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే తమ ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ సరైన సమాధానం చెప్పలేదనేది బీజేపీ శ్రేణుల వాదన.
దీంతో తమ జెండాలు మాత్రమే తొలగించడాన్ని నిరసిస్తూ పవన్ శర్మ సహా బీజేపీ కార్యకర్తలు కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి శాంతియుత పద్ధతిలో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫోన్ చేశారని, దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను గొడ్డును బాదినట్లు బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ ఘటనలో సీఐగా పేర్కొంటున్న స్థానిక పోలీసు అధికారి అత్యంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఝుళిపించడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో పవన్ శర్మ గాయపడ్డారు.