భారీ వర్షాల కారణంగా రెండు జాతీయ రహదారుల మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్ణణంలోని కోనారెడ్డి చెరువుకు భారీ గండి పడింది. దాదాపు 100 ఫీట్ల మేరకు చెరువు కట్ట తెగి భారీ గండి పడిన కారణంగా నీరు రోడ్లపైకి ప్రవహించింది. దీంతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి భారీ గండి పడి రాకపోకలు స్తంభించాయి. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని జంగాలపల్లి వద్ద రామప్ప చెరువు నీరు హైదరాబాద్-జగదల్ పూర్ జాతీయ రహదారిని ముంచేసింది. పాక్షికంగా జంగాలపల్లి గ్రామం కూడా ముంపునకు గురైంది. దీంతో వరంగల్-ఏటూరునాగారం-జగదల్ పూర్ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా బండారుపల్లికి చెందిన ఇద్దరు మత్స్యకారులు జంగాలపల్లి సమీపంలోని మేడివాగులో గల్లంతయ్యారు.
ఫొటో: వర్ధన్పపేట వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి పడిన గండి