కరోనా టెస్టుల విషయంలో తెలంగాణా సర్కార్ తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలేమోగాని, ఎన్నికలు పూర్తయ్యాక కరోనా సెకండ్ వేవ్ ఫలితాలు మాత్రం వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణా రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణతీరు సక్రమంగా లేదని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రతిరోజూ 50 వేల టెస్టులు చేయాలనే ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని అభిప్రాయపడుతూ, ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో కరోనా టెస్టులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అయితే ‘అవసరం ఉన్నపుడు రోజుకు 50 వేల టెస్టులు చేస్తాం’ అని నివేదికలో పేర్కొనడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించింది. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. కాగా ఈ విషయంలో రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆయనను హైకోర్టు ఆదేశించింది