హైదరాబాద్ నగరంలో తుపాకులు పట్టుబడిన ఘటన కలకలం సృష్టించింది. రాచకొండ కమిషనరేట్ పోలీసులు తుపాకుల ముఠా సుత్రధారున్ని చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుని నుంచి ఏడు దేశవాలీ తుపాకులు, 11 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆయుధాల్లో రివాల్వర్లు, పిస్టళ్లు, తపంచాలు ఉన్నాయి. ముఠాలో తప్పించుకున్న మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన సాయిరాంరెడ్డి బీకాం చదువును మధ్యలోనే ఆపేశాడు. నగరానికి చేరుకున్న సాయిరాంరెడ్డి సూరారంలోని ఓ హాస్టల్ లో ఉంటూ భారీ వ్యూహమే పన్నాడు. తొలుత నాగోల్ లోని అమెజాన్ బ్రాంచ్ లో నాలుగు నెలలపాటు పనిచేశాడు. రెండు దొంగతనాలకు పాల్పడిన సాయిరాంరెడ్డి జైలుకు వెళ్లాడు. అక్కడ కొందరు ఖైదీలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈజీ మనీ కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగానే గ్యాంగ్ స్టర్ తరహాలో భారీ నేరాలను పాల్పడాలని పథకరచన చేశాడు. వెపన్స్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నాడు. ముంబయి, ఆంధ్రప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడాలని స్కెచ్ వేశాడు. అయితే సాయిరాంరెడ్డి గ్యాంగ్ గురించి సమాచారం అందుకున్న మల్కాజిరిగి ఎస్వోటీ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు.
ఈ గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంలో దర్యాప్తు సాగుతోందని, మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. ఇంటి అద్దెకోసం, హాస్టళ్లలో ప్రవేశం కోసం వచ్చేవారి పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా హితవు చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకుని వ్యవహరించాలని సూచించారు.