కిడ్నీ వ్యాధి గల ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఉచిత డ‌యాల‌సిస్ సేవ‌లు అందించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేరకు ఆరోగ్య శ్రీ స‌మీక్ష‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హ‌రీష్ రావు ఈ విషయాన్ని వెల్ల‌డించారు. హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ న‌గ‌రాల్లో ఇందుకోసం ప్ర‌త్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ రెండు కేంద్రాల్లో ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఐదు బెడ్ల చొప్పున కేటాయించి డ‌యాల‌సిస్ సేవ‌ల‌ను అందించాల‌ని, త‌క్ష‌ణ‌మే ఈ కేంద్రాల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆదేశించారు. డ‌యాల‌సిస్ చేయించుకోవ‌డం కిడ్నీ రోగుల‌కు ఆర్థికంగా చాలా భారంగా మారింద‌ని, ఈ నేప‌థ్యంలో వారి కోసం ప్ర‌త్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు చెప్పారు.

కాగా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆధీనంలో 43 డ‌యాల‌సిస్ కేంద్రాలు న‌డుస్తున్నాయ‌ని, వీటి ద్వారా 10 వేల మంది రోగుల‌కు సేవ‌లు అందుతున్నాయ‌ని చెప్పారు. డ‌యాల‌సిస్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కు ఏటా రూ. 100 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్నదని మంత్రి స్ప‌ష్టం చేశారు. రోగుల‌ సంఖ్యకు తగ్గట్టుగా డయాల‌సిస్ మెషీన్లను ఏర్పాటు చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. ఇకముందు నుండి ఎయిడ్స్, హెపటైటిస్ రోగుల‌కు డయాల‌సిస్ కేంద్రాలను యుద్దప్రాతి పదికన ఏర్పాటు చేయలని మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు.

Comments are closed.

Exit mobile version