మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కారు. ఆయన వెంట బీజేపీకి చెందిన నాయకుడు, ఓ మీడియా సంస్థ అధిపతి కూడా ఉన్నట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈటెల రాజేందర్ రేపు భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా నెలరోజుల క్రితం తెలంగాణా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ అనేక పరిణామాల మధ్య ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈటెల రాజేందర్ శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెడుతుండగా నిఘా వర్గాలు రహస్యంగా తీసినట్లు వ్యాప్తిలోకి వచ్చిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఈవార్తా కథనంలో మీరు చూస్తున్న ఫొటో అదే కావడం గమనార్హం.