వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. హిందూ దేవుళ్లపై విద్వేషపూరిత ప్రతిజ్ఞ చేశారనే అభియోగంపై న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా కరీంనగర్ త్రీటౌన్ పోలీసులను ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశించారు. కేసు పూర్వాపరాల్లోకి వెడితే…

గత మార్చి నెలలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ (ధూళికట్ట) గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వేరో సభ్యులతో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు చేయించిన ప్రతిజ్ఞలో హిందు దేవుళ్లయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల ఎవరి మీదా నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే శ్రాద్ధ కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి స్వేరోస్ సభ్యులందరు ఎడమ చేతిని చాచి ప్రతిజ్ఞ చేస్తుంటే, వారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేయి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తన మత విశ్వాసాలను దెబ్బతీశారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి హిందు దేవుళ్లను అవమానించి, కించపరిచే విధంగా వ్యవహరించారని పేర్కొంటూ ఫిర్యాదులో ప్రతిజ్ఞ చేసిన వీడియోను, పత్రికలో వచ్చిన వార్తను సేకరించి, ఆధారాలతో సహా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో గత మార్చి 16వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారి అయిన పోలీసు కమీషనర్ కు అదే నెల 18న మళ్లీ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో చివరికి మార్చి 22న ప్రిన్సిపల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఫిర్యాదిదారైన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తన న్యాయవాది ఎన్నంపల్లి గంగాధర్ ద్వారా కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు దాఖలు చేశారు.

అయితే ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోర్టులు సరిగ్గా పని చేయకపోవడంతో ఇన్ని రోజులు పిటిషన్ పెండింగులో వస్తూ ఉన్నది. చివరికి కేసు ఆధారాలను, పూర్వపరాలను పరిశీలించిన తరువాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా న్యాయమూర్తి సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు.

న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి

ఈ సందర్భంగా ఫిర్యాదిదారు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐపీఎష్ అధికారిగా విధులు నిర్వహించిన స్వేరోస్ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వసాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. హిందువులకు, హిందూ దేవుళ్లకు, దేశానికి వ్యతిరేకంగా సెక్యూలర్ ముసుగులో మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా మార్చుకున్నారని, వీళ్ళు ఎంతటివారైన విడిచిపెట్టేదిలేదని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. అలాగే స్వేరోస్ సంస్థ గురుకులాల విద్యార్థులకు ప్రతిజ్ఞలు చేయిస్తూ, హిందూ వ్యతిరేక భావజాలాన్ని పెంచుతూ, హిందూ దేవుళ్ల పట్ల విషం కక్కుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విద్యార్థుల మెదడులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషబీజాలను నాటుతున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై వెంటనే కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదిదారైన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments are closed.

Exit mobile version