అనగనగా ఓ కక్కుర్తి తహశీల్దార్. రెవెన్యూ శాఖలో తాను మాత్రమే నిజాయితీపరుడిననే ఫోజు. నీతి ‘కత’లు చాలా చెబుతుంటాడు. కానీ విజిలెన్స్ నివేదిక అతని నీతి, నిజాయితీలపై ఏం తేల్చింది? అతన్ని ఓ అవినీతి పరునిగా ఉటంకించింది. పేదలకు ప్రభుత్వం అందించే సాయం సొమ్ముకూ కక్కుర్తి పడి లంచాలుగా వసూళ్లు చేస్తుంటాడని తేల్చింది. చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో ఇటువంటి అవినీతి పరులైన మొత్తం 43 మంది అధికారులపై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆయా అవినీతిపరులపై ఎటువంటి చర్యలు లేకపోవడమే అసలు విశేషం.

ఇక అసలు విషయంలోకి వెడితే… హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ అవినీతి ‘కత’ ఇది. పేదింటి కుటుంబాల్లో జరిగే పెళ్ల వేడుకల్లో సంతోషాన్ని నింపడానికి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన నిరుపేద యువతుల వివాహాల కోసం లక్షా 16 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలోనూ రెవెన్యూ అధికారులు కొందరు బ్రోకర్లను నియమించుకుని అక్రమ వసూళ్లకు తెగబడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవి ఆరోపణలు మాత్రమే కాదు. వాస్తవాలుగా నిర్ధారిస్తూ, తెలంగాణాలోని 10 జిల్లాలకు చెందిన 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది పేదలను ఏ విధంగా దోచుకున్నదీ విజిలెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టంగా వివరించడం గమనార్హం.

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ వసూళ్ల బాగోతాన్ని బహిర్గతం కావడానికి దారి తీసింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఈ అవినీతి దందాలో ధర్మసాగర్ తహశీల్దార్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం 43 మంది అవినీతిపరుల జాబితాలో ధర్మసాగర్ తహశీల్దార్ సారుగారి పేరే అందరికన్నా ముందుండడం మరో విశేషం. ఈ తహశీల్దార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా భారీ ఎత్తున ‘వసూళ్లు’ చేసినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం తహశీల్దార్ కొందరు ప్రజాప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు ఆయా నివేదికలో స్పష్టంగా ఉంది. తహశీల్దార్ లంచాల బాగోతపు వసూళ్లలో మాజీ ఎంపీపీ గుడి వెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డితోపాటు సోంపల్లి కరుణాకర్ ప్రమేయమున్నట్లు విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించడం గమనార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా లంచాల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన 43 మంది రెవెన్యూ సిబ్బందిలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ ఏలు ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ గా విజిలెన్స్ జాబితాలో తొలిపేరుగా ప్రస్తావించిన ఎం. రాజ్ కుమార్ అనే పేరుపైనా అనేక అనుమానాలు ఉన్నాయి.

వాస్తవానికి ఈ పేరుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్న కాలం నుంచి, అంటే గడచిన ఏడేళ్ల కాలంలో రాజ్ కుమార్ అనే పేరుగల అధికారి ఎవరూ ఇక్కడ తహశీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. గత కొంత కాలంగా సీహెచ్ రాజు అనే అధికారి మాత్రమే ఇక్కడ తహశీల్దార్ గా పనిచేస్తుండడ గమనార్హం. పథకం కోసం దరఖాస్తు స్వీకరించడానికే ధర్మసాగర్ తహశీల్దార్ ‘రాజ్’ కుమార్ లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

విజిలెన్న్ నివేదికలో ధర్మసాగర్ తహశీల్దార్ అవినీతి ‘కత’

అయితే ఇటువంటి 43 మంది అవినీతి ‘రాజ్’లపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని గత జూన్ 19వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ అవినీతి తహశీల్దార్ పై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. విజిలెన్స్ నివేదికలో తహశీల్దార్ అవినీతిని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సహజమైన అభిప్రాయాలే ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల్లోనే ఆయా తహశీల్దార్ అవినీతి, అక్రమాలు మరింత ఊపందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version