ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హాలియాలో ఈనెల 10వ తేదీన సీఎం కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగింది. వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి అనువుగా రూ. 3,000 కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంఖుస్థాపన చేయాలని నిర్ణయించారు.
ఈ నెల 10న మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.