తెలంగాణా సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్ లో పర్యటించిన సంజయ్ మాట్లాడుతూ, కేసీఆర్ మందు తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారని అన్నారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ భయమేస్తోందన్నారు. కేసీఆర్ దగుల్బాజీ ముఖ్యమంత్రి అని, బడా చోర్ ముఖ్యమంత్రి అని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, హైదరాబాద్ లో మేయర్ ఎన్నికలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ముందస్తు షెడ్యూల్ ఎందుకు పెట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతవుతుందని, వరంగల్ లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్ వరద బాధితులకు రూ. పదివేలు ఇచ్చిన కేసీఆర్ వరంగల్ లో ఎందుకు ఇవ్వలేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినట్టే వరంగల్ లోనూ జరగబోతోందని, ఇక్కడ బీజేపీ గెలవబోతోందన్నారు. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయని, అందుకే వరంగల్ లో ఎన్నికలు పెట్టడం లేదన్నారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 196 కోట్ల రూపాయలు ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. పదోన్నతులు లేక తెలంగాణా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని ఆన్నారు.
వరంగల్ అభివృద్ధిపై భద్రకాళి దేవాలయంలో ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా? అని సంజయ్ సవాల్ విసిరారు. వరంగల్ లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.