జర్మనీలో గల తమ ఎమ్మెల్యే విమానం టికెట్ కోసం స్థానికులు కొందరు భిక్షాటనకు దిగిన వైనమిది. గడచిన కొన్ని నెలలుగా తాము ఓట్లు వేసి గెలిపించిన శాసనసభ్యుడు కనిపించడం లేదని, ఆయన జర్మనీలో ఉన్నట్లు సమాచారం ఉందని వారు పేర్కొంటున్నారు. జర్మనీలో గల ఎమ్మెల్యేను తమ నియోజకవర్గానికి రప్పించేందుకు విమాన టికెట్ ఛార్జీల కోసం ధర్మం చేయాల్సిందిగా భిక్షాటనకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
![ts29 vemula 1](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/vemula-1.jpg?resize=768%2C1024&ssl=1)
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోనే, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందే కొందరు తమ ఎమ్మెల్యే విమానం టికెట్ ఛార్జీల కోసం భిక్షాటనకు దిగడం విశేషం. వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేష్ బాబు గత కొన్ని నెలలుగా జర్మనీలోనే ఉంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆయన స్థానికంగా లేకుండాపోయారు. దీంతో తమ ఎమ్మెల్యే జాడ తెలియడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ బాబుపై ఇంటిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులే ఈ తరహా వినూత్న నిరసనకు దిగడం గమనార్హం.
జర్మనీలో గల తమ ఎమ్మెల్యేను స్పెషల్ ఫ్లయిట్ లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, అందుకోసమే భిక్షాటన చేస్తున్నట్లు నిరసనకారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు కనిపించడం లేదని గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు అందిన దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే వ్యవహార వైలిలో మార్పు రాకపోవడం, ఎనిమిది నెలలుగా జాడ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలియడంతో, అతన్ని రప్పించేందుకు విమాన చార్జీల కోసమంటూ వినూత్న భిక్షాటనకు దిగడం చర్చకు దారి తీసింది.