ఖమ్మం నగరంలో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన డుంగ్రోత్ వీరేష్ (21) అనే గిరిజన యువకుడిపై ఓ వామపక్ష పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు పెట్రోల్ పోసి నిప్పంటించారనే ఆరోపణలు వచ్చాయి. బాధిత యువకుడు చావుబతుకుల మధ్య ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూకబ్జాలు, నకిలీ డాక్యుమెంట్ల తయారీలో పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయా వామపక్ష పార్టీ కార్యకర్త ఒకరు వీరేష్ భూమికి కూడా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడనే ఆరోపణలు వచ్చాయి.
మృత్యువుతో పోరాడుతున్న వీరేష్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. జడ్జి ముందు ఆయన మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని వీరేష్ కుటుంబ సభ్యులు ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వీరేష్ తండ్రి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా, తాము నిలువరించినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ తుమ్మ గోపి ts29కు చెప్పారు. ఇందుకు సంబంధించి తమకు ఫిర్యాదు అందిందని, మొత్తం ఘటనపై తాము విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఓ మైనర్ బాలికపై జరిగిన అమానుష ఉదంతాన్ని ప్రజలు మరువకముందే ఖమ్మం నగరంలో చోటు చేసుకున్న ఈ తాజా ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది.
ఫొటో: బాధిత గిరిజన యువకుడు డుంగ్రోత్ వీరేష్