తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో తెలంగాణా పోలీస్ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నదా? గత కొంత కాలంగా స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) ఈ అంశంలో చాకచక్యంగా పావులు కదుపుతున్నదా? మావోయిస్టు పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ముఖ్య నక్సల్ నేతలను ‘లొంగుబాటు’ దిశగా పయనింపజేయడంలో ఈ విభాగం సఫలీకృతమైందా? 1990వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య దంపతులను, కొయ్యూరు ఎన్కౌంటర్ ద్వారా నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి వంటి అగ్రనేతలను మట్టుబెట్టిన తరహా సంచలన ఘటనను తెలంగాణా పోలీసు శాఖ తన చరిత్రలో లిఖించుకోబోతున్నదా? ఔననే ప్రచారం ఊపందుకుంది.
కాకపోతే ఈసారి ఎన్కౌంటర్ ఘటన ద్వారా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే ‘లొంగుబాటు’ ఉదంతం ద్వారా అనేది ప్రచారపు సారాంశం. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నారనే వార్తలు ఈ ఉదయం నుంచీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గణపతి వంటి అగ్రనేత లొంగుబాటు అంశంపై జరుగుతున్న ప్రచారంపై ‘హక్కుల సంఘం’ నేతలు గాని, ఇతరత్రా విప్లవ సానుభూతిపరులుగాని ఎటువంటి ప్రకటనలు కూడా చేయకపోవడం గమనార్హం.
సాధారణంగా ఇటువంటి ప్రచారం సందర్భాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను సమర్థించే సంస్థల నేతలు వెంటనే స్పందిస్తుంటారు. అంతేగాక ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా స్పందించే అవకాశం ఉంటుంది. పార్టీపై జరిగే ఈ తరహా ప్రచారపు వార్త సంబంధీకులకు చేరడానికి ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యవధి కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా నిమిషాల్లోనే విషయం విశ్వవ్యాప్తమవుతోంది. కానీ గణపతి లొంగుబాటు అంశంలో మావోయిస్టు పార్టీ నాయకులుగాని, దాని అనుబంధ, సానుభూతి సంస్థలకు చెందినవారు గాని ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణా పోలీసు శాఖ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకోబోతున్నదనేది తాజా ప్రచారపు సారాంశం. అదేమిటంటే… మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి మాత్రమే కాదు ఆయన వెంట మరో నలుగురు ముఖ్య నేతలు కూడా లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ప్రకంపనల సారాంశం. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లొజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కడారి సత్యానారాయణ అలియాస్ కోసాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గణపతి సహా ఆయా ఐదుగురు మావోమయిస్టు పార్టీ నేతలు కేంద్ర కమిటీ సభ్యులు కావడం గమనార్హం.
ఆయా నాయకుల లొంగుబాటుకు చాలా కాలం నుంచే ఎస్ఐబీ విభాగపు పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తెలంగాణా పోలీసుల కృషి ఫలితంగా మావోయిస్టు పార్టీకి చెందిన ఆయా ముఖ్య నేతలు లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ‘బ్రేకింగ్’ ప్రచారం. ఈ లొంగుబాట్ల అంశంలో ఉత్తర తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు మధ్యవర్తిత్వం జరిపారనేది కూడా మరో ప్రచారం. మరోవైపు నక్సలైట్లు ఎవరు లొంగిపోయినా తాము స్వాగతిస్తామని తెలంగాణా పోలీసు శాఖ వర్గాలు ప్రకటించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
గణపతి సహా మావోయిస్టు పార్టీకి చెందిన ఆయా కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటలో పయనిస్తే తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన ఘటనగా నమోదవుతుందనడంలో సందేహం లేదు. రెండు రోజుల్లో గణపతి, మరికొందరు ముఖ్య నేతలు పోలీసులకు లొంగిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా ఆయా లొంగుబాట్ల ప్రచారపు అంశం విప్లవోద్యమ చరిత్రలో సంచలన దృశ్యాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే!