కరోనా లాక్ డౌన్ మద్యపాన ప్రియులను అల్లాడించింది. లిక్కర్ దాహార్తిని పెంచిందనే చెప్పాలి. ఫలితంగా సామాజిక దూరాన్ని కూడా విస్మరించి గుక్కెడు మద్యం కోసం తోపులాట తరహాలో పాకులాడుతున్న ఘటనలు అనేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. తెలంగాణా సరిహద్దుల్లోని భద్రాచలం పక్కనే గల తూర్పుగోదావరి జిల్లా ఎటపాక నుంచి విజయవాడ మీదుగా తెనాలి వరకు ఎక్కడ చూసినా మందుబాబుల గోలే. తమిళనాడు సరిహద్దుల్లోని ఆంధ్రా పల్లెల్లో కూడా వైన్ షాపుల మందు బారులు తీరిన ఆసక్తికర సన్నివేశాలే. వైన్ షాపుల ముందు అక్కడక్కడా పరిస్థితి అదుపు తప్పిన ఫలితంగా కొన్ని చోట్ల పోలీసులు తమ లాఠీలకు పని కల్పించక తప్పలేదు.
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ పరిణామాల్లో ఇటువంటి దృశ్యాలు చెబుతున్నదేమిటి? ఇదీ ఓ ఉపాధ్యాయుని తాజా సందేహం. లాక్ డౌన్లో జరిగిన పలు ఘటనలను ఉదహరిస్తూ సదరు టీచర్ ఓ వాట్సాప్ పోస్టులో పలు సందేహాలను రేకెత్తించారు. ఓ రకంగా చెప్పాలంటే తాజా స్థితిపై ప్రశ్నలు కురిపించారు. ఇంకా ఆ టీచర్ ఏమంటున్నారో దిగువన గల అతని పోస్టులోనే చదవండి.
‘‘నేడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు దగ్గర జనంతో నిండిన ఈ బారులు చూస్తుంటే నాకు తెలిసి జనం ఎవ్వరూ ఈ 40 రోజుల లాక్డౌన్ కాలంలో సంపాదన లేకుండా బాధపడటం లేదు అనిపిస్తుంది. రోజువారీ కూలీలకు, పేదవాళ్లకు పనులు లేవు తినడానికి తిండి లేదు, సంపాదన లేదు అని కొన్ని స్వచ్చంద సంస్థలు, కుల సంఘాలు, చందాలు వేసుకు మరీ గడపగడపకు తిరిగి ప్రతి ఇంటికి సరుకులు కూరగాయలు ఉచితంగా సరఫరా చేస్తే ఈరోజు ఈ బార్లు దగ్గర పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ సంపన్నుడు ఎవరూ లేరు ఉన్నది రోజువారీ కూలీలే. ఇప్పుడు వీళ్ళను చూసి ఈ 40 రోజుల లాక్డౌన్ కాలంలో సహాయం చేసిన స్వచ్చంద సంస్థలు సిగ్గుపడాలా, సహాయం పొందిన ప్రజలు సిగ్గుపడాలో అర్ధం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి చూసినాక భవిష్యత్తులో సహాయం చేయడానికి స్వచ్చంద సంస్థలు ముందుకు రాగలవా? ఏ పేదవాని పరిస్థితి చూసైనా ఆపన్న హస్తం అందించగలవా?’’