నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నిన్న జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే కావచ్చు. గెలుపుపై ఎటువంటి సందేహాలు లేకపోవడంలోనూ ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ తన గారాలపట్టికి తెలంగాణా సీఎం కేసీఆర్ ఎటువంటి పదవీ పట్టాభిషేకాన్ని చేయబోతున్నారు? ఇదీ తాజా రాజకీయ ప్రశ్న.
గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవితపై భిన్నకథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ కవితకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. వాస్తవానికి కరోనా మహమ్మారి వ్యాపించకుంటే ఇప్పటికే కవిత ఎమ్మెల్సీగా దాదాపు అయిదునెలల పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకునేవారు. కరోనా పరిణామాల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది.
ఎట్టకేలకు నిన్న జరిగిన ఎన్నికల్లో కవిత గెలుపు ఏకపక్షమని కూడా అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పోలింగ్ ముగిశాక వ్యాఖ్యానించారు. మొత్తం ఓట్లలో 90 శాతం వరకు కవితమ్మకే వస్తాయని ఆయన అశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం అంటే ఈనెల 12వ తేదీన నిర్వహిస్తారు. కవిత గెలుపు లాంఛనమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఆ తర్వాత లభించే పదవిపైనే ప్రస్తుతం అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆమెకు మంత్రి పదవి ఖాయమని కూడా అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం శాసనసభలో గల సభ్యుల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యుల సంఖ్య 18కి మించరాదు. ఒకవేళ కవితకు తప్పనిసరిగా మంత్రి పదవి కేటాయించాలని సీఎం భావిస్తే, ప్రస్తుతం తన కేబినెట్లోగల సహచరుల్లో ఎవరో ఒకరిని అనివార్యంగా తొలగించాలి. లేదంటే కవిత కోసం తామే స్వచ్ఛందంగా పదవిని త్యాగం చేస్తున్నట్లు ఎవరో ఓ మంత్రి ఉద్యుక్తమై ముందుకు రావాలి. ఇవేవీ జరగకుండా కవితను మంత్రివర్గంలోకి తీసుకోవడం అసాధ్యమనేది రాజకీయ పరిశీలకుల లెక్క.
మరోవైపు ఆమెకు శాసనమండలిలో విప్ పదవిని కట్టబెడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే దశలో తెలంగాణా అధికార పార్టీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో అంచనా వేస్తున్న పరిణామాలు ఇప్పుడు జరగవచ్చంటున్నారు. ఇదే జరిగితే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, తన కుమారుడు, మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైందనే వాదన కూడా వినిపిస్తోంది. అనంతర పరిణామాల్లో పార్టీ బాధ్యతలను కవితకు అప్పగించే అవకాశముందంటున్నారు.
అంటే ప్రస్తుతం కేటీఆర్ నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కవితను కూర్చోబెట్టి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా ఢిల్లీకి పయనమవుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం 1,327 చదరపు గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడాన్ని పార్టీ వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. ఆఫీసు నిర్మాణం అత్యంత వేగంగా పూర్తవుతుందని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహణకోసం ఢిల్లీకి వెళ్లడం ఖాయమంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీగా కవిత లాంఛనప్రాయ గెలుపు పరిణామాల అనంతరం చోటు చేసుకునే రాజకీయ మార్పులపై అధికార పార్టీ వర్గాలు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయనేది కాదనలేని అంశం.