క్రిస్మస్ మరుసటి రోజది.. 2004 డిసెంబర్ 26 తేది… ఎప్పటిలాగే ఆరోజు కూడా తెల్లవారింది.. మామూలుగానే సమయం గడుస్తుంది. ఉన్నట్లుండి జనంలో కంగారు మొదలైంది. మొదట తెలిసిన వార్త సముద్రం భీకర రూపం దాల్చి పొంగుతుందని… ఊర్ల మీద పడిపోతుందని టీవీలలో ఒకటే వార్తలు గుప్పిస్తున్నారు… చిన్నపాటి వర్షం… పెనుగాలులు లేకుండా ఉప్పెన ఏమిటని అందరూ సందేహంలో పడ్డారు. అసలు జరుగుతున్నదేమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక భక్తిపరుల అంచనా ప్రకారమైతే ప్రజలలో పాపాలు పెచ్చరిల్లాయని, భగవంతుడు ప్రక్షాళనం మొదలుపెట్టేరని అందుకే ఈ ఆకస్మిక జల ప్రళయం విరుచుకుపడుతుందని తేల్చిపారేశారు. మానవాళి అంతమైపోతుందని మరికొందరు తేల్చిపారేశారు. టీవీలలో ఇదే గోల. ఓ టీవీ జిల్లా రిపోర్టర్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ఒక అడుగు ముందుకేసి తన వార్తల ద్వారా మరింత సంచలనం కల్గించాలని మరికొన్ని నిమిషాలలో బందరు సముద్రంలో ఐక్యం చెందుతుందని చిలక జోస్యం చెప్పారు. సముద్ర కెరటాలు ఉవెత్తున ఎగిసిపడి బందరు శివారు ప్రాంతమైన శారదానగర్ చేరుకున్నాయని ప్రజలలో మరింత భయోత్పాతం కల్గించాడాయన.
ఇటువంటి పరిస్థితులలో వార్తలకన్నా వదంతులు ఎక్కువ వేగంగా వ్యాపిస్తాయి. కొందరు ఆ కట్టుకథలు తీవ్రంగా పరిగణించి ఇల్లూ, వాకిలి వదిలి పిల్లా, పాపలతో పరుగులంకించుకొన్నఘటనలు పలు తీర ప్రాంత గ్రామాలలో నమోదైయ్యాయి. క్షేమం తెలుసుకోవడం కోసం సముద్ర తీరానికి దూరాన ఉన్న బంధు మిత్రుల నుంచి ఫోన్లు. తక్షణమే హైదరాబాద్ వచ్చేయమని సూచనలు ఇచ్చేస్తున్నారు. మధ్యాహ్నం దాటేసరికి టీవీలలో దృశ్యాలు మొదలయ్యాయి. జాతీయ ఛానెల్ ఎన్డీటీవీ మాత్రమే జరుగుతున్న ఉత్పాతం పేరు ‘సునామీ’ అని వాస్తవం ఆనాడు ప్రజలకు తెలిపింది. యధాప్రకారం నాలిక కర్చుకొన్న మన తెలుగు చానెళ్లు మరో అవతారమెత్తి ప్రకృతి విలయానికి బలయినవారి మృతదేహాలు చూపించడం మొదలుపెట్టారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మృతుల బంధువుల ఆవేదన. గుట్టలుగా శవాలు ఎంతటి వాళ్ళనైనా హృదయాలను కలిచివేసే దృశ్యాలు. మరణాల సంఖ్య ఇతమిద్దంగా తెలియకపోయినా నష్టం అపారమని చెప్పాయి. రెండ్రోజులపాటు ఇవే దృశ్యాలు టీవీ చానెళ్లలో… 26వ తేదీ ఆదివారం కావడంతో ఎక్కడినుంచో టూరిస్ట్ బస్సులో బందరు మంగినిపూడి బీచ్ కు ఉదయం 8 గంటలకే విహారయాత్రకు వచ్చిన 26 మందిని కడిలి కబళించింది. సాధారణంగా బందరు మంగినిపూడి బీచ్ కు పర్యాటకులు ఉదయం 11 గంటల నుంచి క్రమేపీ పెరగడం గమనించవచ్చు. ఒకవేళ సునామీ గనుక మధ్యాహ్నమో, సాయంత్రపు వేళలో వచ్చినట్లయితే ఆ నష్టం తీవ్రస్థాయిలో ఉండి ఉండేది. ఆదివారం తెల్లవారు జామున ఇండోనేషియాలో సుమత్రా దీవుల పశ్చిమ తీరంలో సముద్ర గర్భంలో రేగిన భూకంపాల పరంపర సునామీ రూపంలో మొత్తం హిందూ మహాసముద్ర తీర దేశాలన్నింటిని కదిలించివేసింది. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్ లాండ్, సోమాలియాలతో సహా మొత్తం 14 దేశాలలో సుమారు 2,30,000 మందిని సునామీ పొట్టన పెట్టుకుంది. సుమారు 30 కిలోమీటర్లు లోతులో సముద్రంలో సంభవించిన భూకంప పరిణామాలు సముద్ర కెరటాలు 30 అడుగుల ఎత్తున ఎగిరేటట్లు చేశాయి. తద్వారా తీర ప్రాంతాలన్నీ నేలమట్టం అయ్యాయి.
ఆ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై అప్పట్లో 9 .1 గా నమోదయ్యాయి. అప్పట్లో ఆ భూప్రకంపనలు 8 .3 నుండి 10 నిమిషాలు వరకు కొనసాగాయి. ఇటువంటి భూకంప తీవ్రతకు భూగోళం అంతా 1 నిముషం పాటు కంపించిపోయింది. అలస్కా వంటి దూర ప్రాంతంలో, మన దేశంలో తమిళనాడు తీర ప్రాంతంలో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ వంటి దేశాల్లో కూడా జరిగిన అపారనష్టాన్ని అంచనా వేయడం అప్పట్లో కష్టమైపోయింది. మన దేశంలో ఏడు చోట్ల అప్పట్లో సముద్రంలో పోటెత్తింది. ఆగ్నేయ, దక్షిణాసియా దేశాలలో ప్రజలు హాహాకారాలు చేశారు. మన రాష్ట్రమే కాకుండా తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో మృత్యు తాండవం జరిగింది. అప్పట్లో దాదాపు 13,000 మంది ఘోర మరణానికి గురి అయినట్లు అధికారికంగా ధ్రువీకరించినారు. జపాన్లో హిరోషిమాపై అణుబాంబు ప్రమాదం కంటే దాదాపు 1,500 రెట్లు అధికమని అంచనా వేశారు. అయితే అప్పట్లో జరిగిన సునామీని ముందుగా గుర్తించలేక పోవడమనేది ప్రధాన లోపం… ఎందుకంటే ఇండోనేషియా తీరంలో సంభవించిన తొలి భూకంపానికి, సునామీ ఉత్పాతానికి మధ్య చాల గంటల వ్యవధి ఉన్నా ఈ కల్లోలం మన దేశం వరకు వచ్చే వరకూ ఎవరూ పసిగట్టలేదు.
హిందూ మహాసముద్రంలో ఈ ముప్పును గుర్తించే, హెచ్చరించే యంత్రాంగం, వ్యవస్థ లేవీ లేక పోవడం వల్ల సునామీని గుర్తించలేకపోయారు. నిజానికి సునామీని గుర్తించాలంటే అంత సులభం కాదు. సునామీని గుర్తించడానికి ఎంతో సున్నితమైన సెన్సార్లు అవసరం. ఇక్కడ మనమంతా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే భూకంపం జరిగిన కేంద్ర ప్రాంతం నుండి కొన్ని వేల కిలోమీటర్లకు సునామీ జరగవచ్చు. అయితే సునామీ వచ్చేముందు అనగా కొన్ని నిముషాల ముందు సముద్ర తీరం చాలా కిలోమీటర్లు లోపలి వెళుతుంది. అంతలోనే ఒకేసారి పెను ఉద్ధృతితో ఉప్పెనలాగా భీకరంగా అలలతో జలప్రళయాన్ని తలపిస్తూ తీర ప్రాంతాల మీదకు దూసుకెళుతుంది. దీని అనుభవంగా సునామీని గుర్తించే యంత్రాంగం ఆవశ్యకతను ప్రపంచ దేశాలు 2004 తర్వాత గుర్తించాయి. అదేవిధంగా 2004 నాటికి అమెరికా సునామీని గుర్తించగల్గినా ఏ దేశానికి ఆ విషయాన్ని తెలియజేయాలో తమకు తెలియకపోవటం వల్ల తీవ్ర నష్టం జరిగిందని వాపోయింది. దీని వల్ల ఐక్యరాజ్యసమితి ‘హిందూ మహా సముద్ర సునామీ హెచ్చరికల యంత్రాంగం’ నెలకొల్పేందుకు గట్టిగా కృషి చేసింది. ఆ తర్వాత 2006 నాటికి ఇది ఒక రూపాన్ని సంతరించుకొని, యునెస్కో సారథ్యంలో 25 సిస్మోగ్రాఫిక్ వీశాట్ కేంద్రాల అనుసంధానంగా 26 దేశాలలో జాతీయ సునామీ కేంద్రాలకు సమర్ధవంతంగా సమాచారం అందించే విధంగా యంత్రాంగం రూపుదిద్దుకొంది.
✍️ ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం