విద్యుత్ షాక్ కారణంగా ఇద్దరు రైతులు దుర్మరణం చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం భోజ్యా తండాకు చెందిన భూక్యా సుధాకర్ (28), మాలోత్ యాకూబ్ (40) అనే రైతులు శనివారం తమ పొలం వద్దకు వెళ్లారు. వ్యవసాయ మోటార్ కు ఫీజులు మారుస్తుండగా, బోరుకు తగులుకున్న జే వైర్ ను రైతులు గమనించలేదు. దీంతో జే వైర్ ద్వారా కరెంట్ సరఫరా కావడం, షాక్ కొట్టడంతో సుధాకర్, యాకూబ్ లు పంట పొలం వద్దే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో విగత జీవులుగా పడి ఉన్న రైతులను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భోరున విలపించారు.