రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నిన్న చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మంత్రి అజయ్ హైదరాబాద్ లోని తన నివాసంలో హోం ఐసొలేషన్ లో ఉన్నారు. తనను కలిసిన, తనతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దయచేసి కోవిడ్ పరీక్ష చేసుకోవాలని మంత్రి మనవి చేశారు.
మంత్రి అజయ్ కు కరోనా పాజిటివ్ గా నిన్నటి వైద్య పరీక్షల్లో తేలింది. అంతకు ముందు రెండు రోజుల క్రితమే అంటే ఈనెల 12వ తేదీన ఖమ్మం నగరానికి చెందిన కొందరు జర్నలిస్టులు మంత్రిని కలుసుకున్నారు. టీయూడబ్ల్యుజే (ఐజేయూ)కు చెందిన జర్నలిస్టులు రాంనారాయణ, వెంకట్రావు, మాటేటి వేణుగోపాల్, వనం వెంకటేశ్వర్లు, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆవుల శ్రీనివాస్, వై. మాధవరావు, మైసా పాపారావు, ఉషోదయం శ్రీనివాస్ లు మంత్రి అజయ్ ను కలిసినవారిలో ఉన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, ప్రభుత్వం పంపిణీ చేసే కరోనా వ్యాక్సిన్ ను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ముందు వరుసలో, ఉచితంగా అందించాలని మంత్రిని కోరుతూ ఓ వినతి పత్రం అందజేశారు. అంతేగాక అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారించాలని కోరారు.
అయితే మంత్రిని కలిసిన సందర్భంగా ఆయా తొమ్మిది మంది జర్నలిస్టుల్లో ఎనిమిది మంది ఎటువంటి మాస్క్ ధరించకపోవడం గమనార్హం. మంత్రి అజయ్ మాస్క్ ధరించినప్పటికీ, తనను కలిసిన జర్నలిస్టులు మాత్రం మాస్కులు లేకుండానే ఆయనతో ముచ్చటించారు. దీంతో మంత్రి అజయ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన పరిణామాలు సహజంగానే జర్నలిస్టు వర్గాల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అంతేగాక రాష్ట్ర వ్యవసాయ మంంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఈనెల 13వ తేదీన అజయ్ కుమార్ తో కలిసి ఖమ్మంలోని ఐటీ హబ్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే తనను కలిసినవారు, వివిధ కార్యక్రమాల్లో తనతో కలిసి పాల్గొన్నవారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అజయ్ కోరారు.
ఫొటో: ఈనెల 12న మంత్రి అజయ్ కుమార్ ను కలిసిన ఖమ్మం జర్నలిస్టులు (ఫైల్)