వివాదాస్పద ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ‘షాక్’నిచ్చే అంశమిది. అనేక రాష్ట్రాల్లో చాలా మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు వివిధ పార్టీల జెండా మోసినట్లుగానే ప్రవర్తిస్తుంటారు. ఐఎఎస్ అధికారి ఒకరు ఓ రాజకీయ పార్టీ నాయకురాలి కాళ్ల దగ్డర మోకరిల్లిన దృశ్యం ఇప్పటికీ తెలంగాణా రాజకీయాల్లో సజీవమే. ఉమ్మడి రాష్ట్రంలో, గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీలుగా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులిద్దరు ఓ మంత్రి రాగానే, ఎదురెళ్లి ఇరువైపులా నిలబడి ఆయన కారు డోర్ తీసిన చరిత్ర కూడా మర్చిపోలేని ఘటనే. ఇప్పుడీ ఉదాహరణలు ఎందుకంటే… పశ్చిమ బెంగాల్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ లో అధికారంలో గల మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ పార్టీల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం గురించి తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజకీయ జ్వాలలను రగిలిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 10వ తేదీన బెంగాల్ పర్యటనకు వెళ్లిన సమయంలో డైమండ్ హార్బర్ వద్ద ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఉదంతంపై బీజేపీ, టీఎంసీ పార్టీలు పరస్పర విమర్శలకు, ఆరోపణలు చేసుకున్నాయనేది వేరే సంగతి. మూడు రోజుల క్రితం జేపీ నడ్డా కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకుంది.
నడ్డా కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడి సంఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకున్నట్లుంది. అందుకే కాబోలు నడ్డా పర్యటన సందర్భంగా సెక్యూరిటీ డ్యూటీని సరిగ్గా నిర్విహించలేదనే కారణంపై ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోం శాఖ హుకుం జారీ చేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి డెప్యుటేషన్ పై పనిచేయాల్సిందిగా ఆదేశిస్తూ డైమండ్ హార్బర్ ఎస్పీ బోలానాథ్ పాండేకు, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠీకి, సౌత్ బెంగాల్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజీవ్ మిశ్రాకు కేంద్ర హోం శాఖ సమన్లు జారీ చేసింది. కేంద్ర సర్వీసుకు డెప్యుటేషన్ పై పిలిచే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారాన్ని కూడా తీసుకోవాలనే నిబంధనను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. అయితే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించిన రూల్స్ ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే దశలో కేంద్ర హోం శాఖ ఇచ్చే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించకతప్పదని కూడా నిబంధనలు చెబుతున్నాయట.
మొత్తంగా జేపీ నడ్డా పర్యటన ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకుందనే వాదన వినిపిస్తోంది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉంటారనే ప్రచారమూ ఉందట. ఈ కారణంగానే కేంద్ర హోం శాఖ సమన్లు జారీ చేసిందనే వార్తల నేపథ్యంలో, వారిని ఢిల్లీకి పంపడానికి మమతా బెనర్జీ సర్కార్ సుముఖంగా లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను బెంగాల్ దీదీ ప్రభుత్వం ఢిల్లీకి పంపుతుందా? పంపకుంటే కేంద్ర హోం శాఖ తదుపరి తీసుకునే సీరియస్ చర్యలేమిటి? అనే ప్రశ్నల సంగతి ఎలా ఉన్నప్పటికీ, అఖిలభారత సర్వీస్ అధికారులు రాజకీయ పార్టీల వివాదాల్లో చిక్కుకుంటే జరిగే పరిణామాలను మాత్రం ఈ ఘటన స్పష్టం చేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… రాజకీయ పార్టీల చొక్కాలు వేసుకున్నట్లు ప్రవర్తించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తునే ఉంటుంది. ఇందుకు సంబంధించి సెంట్రల్ ఇంటలిజెన్స్ విభాగం కూడా నివేదికలు పంపిస్తుంటుంది. ఇంకా అనేక మార్గాల్లో రిపోర్టులు వెడుతుంటాయి. ఏ వాదన ఎలా ఉన్నప్పటికీ ఇటువంటి ‘రిమార్క్’లను ఆపాదించుకునే ఉన్నతాధికారులు సర్వీస్ పరంగా ఇబ్బందులపాలు కాకతప్పదు. ఎందుకంటే ఇటువంటి అధికారుల విషయంలో రాజకీయ నేతలందరూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీలా వారికి అండగా ఉండకపోవచ్చు… అవసరం మేరకు కరివేపాకులా వాడేసుకుని వదిలించుకోవచ్చు కూడా. అందుకే ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చరిత్రలో వారి పనితీరుకు ఓ పేజీ ఉంటుందని చెప్పడానికి ఉదాహరణలు కోకోల్లలు.