దసరా పర్వదినం సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆహార్యం విశేసంగా ఆకట్టుకుంది. సాధారణంగా పోలీస్ యూనిఫాంలో వచ్చి అధికారులు ఆయుధపూజ నిర్వహిస్తుంటారు. కానీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం నిర్వహించిన ఆయుధ పూజలో తఫ్సీర్ ఇక్బాల్ ఈసారి తెల్లని లాల్చీ, పైజామా ధరించడం విశేషం.
తన నివాసం నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ వచ్చి కమిషనర్ ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురోహితుడు తలకు చుట్టిన కండువాను ఆయుధ పూజ అనంతరం తన భుజంపై వేసుకుని తఫ్సీర్ ఇక్బాల్ తిరిగి వెళ్లడం విశేషం. అదేవిధంగా ఆయుధ పూజ సందర్భంగా కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా ఏకే-47 ఆయుధాన్ని పేల్చడం మరో ప్రత్యేకత.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందన్నారు. విజయం చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పోలీసుల గౌరవం, కీర్తిప్రతిష్టలు మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్ ) మాధవరావు, ఆర్ఐలు రవి, శ్రీనివాస్ , సాంబశివరావు, ఆర్మరర్స్ సంఘయ్య, శేఖర్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.