తెలంగాణ రాష్ట్రంలో చాలా యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయని పోలీసు శాఖ ప్రకటించింది. తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టు పార్టీ చాలా యాక్షన్ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు కూడా సమాచారం ఉందన్నారు.
ఈ సమాచారం మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో ములుగు జిల్లా ప్రత్యేక, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విశ్వసనీయ సమాచారం మేరకు మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని వివరించారు. పోలీసు బలగాలు తాడ్వాయి, పసర , మంగపేట తదితర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని చెప్పారు.
మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ స్పష్టం చేశారు.
ఫొటో: ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి నక్సల్ డెడ్ బాడీని తీసుకువస్తున్న పోలీసులు