ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్ కు వెళ్లారు. రేపు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆమె హోం క్వారంటైన్ కు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా బారిన పడడమే ఇందుకు ప్రధాన కారణం.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత నిన్న భారీ ఆధిక్యతతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం కవితను కలిసి అభినందించారు. అయితే అంతకు కొద్దిరోజుల క్రితం డాక్టర్ సంజయ్ కరోనా రోగులకు సేవలందించారు. డాక్టర్ సంజయ్ కూడా కరోనా టెస్టు చేయించుకోగా, ఆయనకు మంగళవారం పాజిటివ్ గా తేలింది. దీంతో తనతో ప్రైమరీ కాంటాక్టులో గల వారు హోం క్వారంటైన్ కు వెళ్లాల్సిందిగా డాక్టర్ సంజయ్ ట్విట్టర్ ద్వారా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు మనవి చేశారు.
సోమవారం ఎమ్మెల్యే సంజయ్ తనను కలిసి అభినందనలు తెలిపిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా హోం క్వారంటైన్ కు వెడుతున్నారు. డాక్టర్ సంజయ్ త్వరగా కోలుకోవాలని, తాను కూడా అయిదు రోజులపాటు క్వారంటైన్ కు వెడుతున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాను క్వారంటైన్ కు వెడుతున్నానని, పార్టీ శ్రేణులు తన ఆఫీసుకు కొద్ది రోజులపాటు రావద్దని కూడా కవిత విజ్ఞప్తి చేశారు.