పైన గల వీడియోను పరిశీలనగా చూడండి. వందలాది మందివరుసగా ఓ వాగు దాటుతున్న దృశ్యమిది. ఇది సాధారణ వీడియో అయితే వార్తల్లోకి వచ్చేది కానే కాదు. వాగు దాటుతున్న వందలాది మందిలో మావోయిస్టు నక్సలైట్లు కూడా ఉన్నారనేది పోలీసుల అంచనా. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఇది. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పెదనల్లబెల్లికి అతి సమీపంలో గల ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా కిష్టారం ప్రాంత అడవుల్లో గిరిజనులతో కలిసి నక్సలైట్లు ఓ వాగును దాటుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మావోయిస్టు నక్సలైట్లు పెద్ద సంఖ్యలో గిరిజనులను సమీకరించి సమావేశం నిర్వహించిన తర్వాత వాగు దాటుతుండగా డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు ఈ వీడియోను చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాగు దాటుతున్నవారిలో ఎంత మంది నక్సలైట్లు ఉన్నారు? వందలాదిగా జనం వారితో ఎందుకు కలిశారనే అంశంపై నిఘా వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి.
కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలోడి-కాసారం గ్రామాల మధ్య నిర్మించిన రహదారిని నక్సలైట్లు ఈనెల 9వ తేదీన 31 ప్రాంతాల్లో కట్ చేసి ధ్వంసం చేశారు. అదేరోజున గ్రామస్తులతో నక్సలైట్లు సమావేశం నిర్వహించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. మొత్తంగా నక్సలైట్లు వాగు దాటుతున్న దృశ్యం తర్వాత అటు ఛత్తీస్ గఢ్, ఇటు తెలంగాణా పోలీసులను అప్రమత్తమయ్యారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఈ వీడియో ఎలా లీకైందనే అంశంపైనా కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.